ఆర్వీ రామారావ్
లక్నో లో 1936లో జరిగిన కాంగ్రెస్ మహాసభలో అఖిల భారత కిసాన్ సంఘం ఏర్పాటులో జడ్.ఎ. అహమద్ కీలక పాత్ర పోషించారు. 1934లో కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ ఏర్పడినప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఆదేశాల మేరకు కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీలో 1937-1938 మధ్య ఆయన సంయుక్త కార్యదర్శిగా ఉన్నారు.
1930లలో జడ్.ఎ.అహమద్ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యా లయంలో చదువుకున్నారు. అప్పుడు బ్రిటన్లో ఉంటున్న సజ్జాద్ జహీర్, కె.ఎం.అశ్రాఫ్ తో అహమద్కు మైత్రి కుదిరింది. ఇంగ్లాండ్ నుంచి తిరిగి వచ్చిన తరవాత కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీలో చేరారు. 1937నుంచి 1939 దాకా యునైటెడ్ ప్రావిన్సెస్ (ప్రస్తుతం ఉత్తరప్రదేశ్) కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా పనిచేశారు. పాకిస్థాన్ వెళ్లి అక్కడ కమ్యూనిస్ట్ పార్టీలో పని చేయాలని ఆదేశించినా మొదట అంత ఉత్సాహం చూపలేదు. ఆయన సన్నిహిత మిత్రుడు సజ్జాద్ జహీర్ మాత్రం పాకిస్థాన్ వెళ్లి కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటుచేసి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఆ దశలోనే అహమద్ కూడా పాకిస్థాన్ వెళ్లమంటే వెళ్లలేదు. కానీ ఆయనను అరెస్టు చేయడానికి వారెంట్ జారీ అయినప్పుడు లాహోర్ వెళ్లిపోయారు. బి.టి.రణదివే పంథాను అంగీకరించనందువల్ల ఆయన సమస్యలు కూడా ఎదుర్కోవలసి వచ్చింది. పాకిస్థాన్లో కొన్ని వారాలపాటు ప్రసిద్ధ సినిమా దర్శకుడు, సోదరుడు అయిన డబ్ల్యు.జడ్.అహమద్ ఇంట్లో ఉన్నారు. అక్కడ కూడా అరెస్టు వారెంటు జారీ కావడంతో కరాచీ వెళ్లి అక్కడ మరో సోదరుడు జఫ్రుద్దీన్ అహమద్తో ఉన్నారు. జఫ్రుద్దీన్ కరాచీలో డిప్యూటీ పోలీసు ఇన్స్పెక్టర్ జనరల్గా ఉండేవారు. జడ్.ఎ.అహమద్ను పట్టి ఇవ్వాలని పాకిస్థాన్ ప్రభుత్వం జఫ్రుద్దీన్ పై ఒత్తిడి తెచ్చినా ఆయన లొంగలేదు. నెల రోజులు కరాచీలో ఉన్న తరవాత జడ్.ఎ.అహమద్ స్వదేశం తిరిగి వచ్చారు.
అహమద్ 1958 నుంచి 1962 దాకా, 1966 నుంచి 1972 దాకా, 1972 నుంచి 1978 దాకా, 1990 నుంచి 1994 దాకా నాలుగు విడతలు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 1976 నుంచి 1978 మధ్య రాజ్యసభలో ప్రభుత్వ హామీల కమిటీ అధ్యక్షుడిగా ఉన్నారు. 1951 నుంచి 1956 దాకా ఉత్తర ప్రదేశ్ కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా ఉన్నారు.