డాక్టరు కిలారు పూర్ణచంద్రరావు
1914 జూన్ 6 వ తేదీన కృష్ణాజిల్లా మంగళాపురం గ్రామంలో జన్మించిన చండ్ర రాజేశ్వరరావుకి జూన్ ఆరవ తేదీ 112 వ జన్మదినోత్సవం. ఆయన శత జయంతి సందర్భంగా నేను రాసిన ‘కమ్యూనిస్టు యోధుడు చండ్ర రాజేశ్వర రావు జీవన గమనం’ అనే పుస్తకం ప్రచురితమైంది. నాకు ఎనిమిది సంవత్సరాల వయసున్నప్పటి నుంచీ ఆయనతో అనుబంధం ఉంది. కొన్ని నెలల పాటు ఆయన మంగళాపురం గ్రామంలో ఉన్నప్పుడు దాదాపు రోజూ ఆయనతో ఓ గంటసేపైనా గడిపే వాడిని. కొంత బంధుత్వం ఉన్నా ఆ కారణంగా కాదు. అప్పటికే ఆయన భారత కమ్యూనిస్టు పార్టీ అగ్ర నాయకుల్లో ఒకరు. చల్లపల్లి జమీందారు అకృత్యాలకు వ్యతిరేకంగా, కౌలు చేస్తున్న పేద ప్రజలకు భూమి హక్కులు కల్పించటం కోసం సమరశీల పోరాటాలు నడిపారు. లాఠీ దెబ్బలు తిన్నారు. జైలు పాలయ్యారు. కోర్టుల చుట్టూ నెలల పాటు తిరిగారు. గ్రామంలో పెద్ద రైతు కుటుంబాల్లో ఒక్కటైన వారి ఇంట్లో పుట్టి, పేద ప్రజల పక్షాన నాయకత్వం వహించిన ఆయన పట్ల గ్రామ ప్రజలకందరికీ ఆరాధనా భావం ఉండేది. ఎంత పెద్ద నాయకుడైనా తన ఇంటి ముందు ఊడ్చేవాడు. కళ్లాపు చల్లేవాడు. సావిత్రమ్మకి ఇంటి పనుల్లో సాయపడేవాడు. నిలువెత్తు భారీ విగ్రహం కలిగి పనులన్నీ చేస్తుంటే నేను విస్మయంతో గమనించేవాడిని. నాకు తెలిసీ తెలియని వయసులో పాలేళ్లు, నౌకర్లు రైతుల కోసం ఎంత కష్టపడుతున్నారో చెప్పి, వాళ్లను గౌరవించాలని, చులకనగా మాట్లాడకూడదని చెప్పేవాడు. రాజకీయాల గురించి తెలియని వయసులో ఆయన వ్యక్తిత్వం నన్నెంతో ఆకర్షించింది. ఆయన పట్ల కలిగిన గౌరవం 1994 ఏప్రిల్ 9 వ తేదీన ఆయన మరణించి, ఆ మర్నాడు అంత్యక్రియల్లో పాల్గొనే వరకు పదిలంగా ఉంది. నేను దిల్లీలో పీహెచ్డీ చేస్తున్నప్పుడు, ఆ తర్వాత ఎప్పుడు దిల్లీ వెళ్లినా అజయ్ భవన్కు వెళ్లి, ఒక పావుగంటైనా సీఆర్ను కలిసి మాట్లాడటం ఎంతో తృప్తిని కలిగించేది.
వామపక్ష ఉద్యమంలో చీలికలు:
స్వతంత్ర భారత దేశంలో జరిగిన తొలి ఎన్నికల్లో భారత కమ్యూనిస్టు పార్టీ పార్లమెంటు ఎన్నికల్లో 5.2 శాతం ఓట్లు, అసెంబ్లీ ఎన్నికల్లో 6.2 శాతం ఓట్లతో ఒక ముఖ్యమైన ప్రతిపక్ష శక్తిగా అవతరించింది. నిషేధం తొలగిన వెంటనే జరిగిన ఎన్నికల్లో నాయకత్వం ఇంకా ప్రజల్లోకి పూర్తిగా రాకున్నా కమ్యూనిస్టు పార్టీతో కూడిన వామపక్ష ఫ్రంట్ 49 స్థానాలను పార్లమెంట్లో సాధించింది. 1957లో జరిగిన రెండవ సార్వత్రిక ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ 10.9 శాతం ఓట్లను సాధించింది. కేరళలో విజయం సాధించి ప్రపంచంలోనే ఎన్నికల ద్వారా ఏర్పడిన తొలి మంత్రివర్గంగా నంబూద్రిపాద్ ప్రభుత్వం ఖ్యాతి గడిరచింది. 1962లో జరిగిన ఎన్నికల్లో కూడా 10.08 శాతం ఓట్లు, 32 పార్లమెంటు స్థానాలతో లోక్సభలో ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. రష్యా, చైనా పార్టీల మధ్య ఏర్పడ్డ విభేదాలు భారత్పై ప్రభావం చూపాయి. భారత కమ్యూనిస్టు పార్టీలో చీలిక ఏర్పడిరది. 1964లో భారత కమ్యూనిస్టు పార్టీ, భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) గా చీలిపోయింది. భారత కమ్యూనిస్టు పార్టీకి ఎస్ఏ.డాంగే అధ్యక్షుడిగా, చండ్ర రాజేశ్వరరావు ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 1967, 1971 ఎన్నికల్లో కూడా భారత కమ్యూనిస్టు పార్టీ పార్లమెంటులో 24 స్థానాలను గెలుచుకుంది. దానికి సమాన స్థాయిలో మార్క్సిస్టు పార్టీ కూడా స్థానాలను సంపాదించింది. అయితే కమ్యూనిస్టు పార్టీకి 69.36 లక్షల ఓట్లు రాగా, మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీకి 75.11 లక్షల ఓట్లు వచ్చాయి. రెండిరటికీ కలిపి దాదాపు పదిశాతం ఓట్లు దక్కాయి. బంగ్లా ప్రజలపై పాకిస్థాన్ మిలిటరీ అకృత్యాలకు పాల్పడుతున్నప్పుడు రాజేశ్వరరావు రష్యాలో పర్యటిస్తున్నారు. బంగ్లా జాతీయ పోరాటానికి భారతదేశం సాయం చేస్తున్నది. అమెరికాతో పాటు పశ్చిమ దేశాలు పాకిస్థాన్కి మద్దతు నిస్తున్నాయి. ఆయన రష్యా అగ్ర నాయకత్వంతో మాట్లాడి, భారత్కు రష్యా భరోసా ఇవ్వటానికి కృషి చేశారు. అమెరికా బెదిరింపులకు తట్టుకొని నిలబడటానికి రష్యా భారతదేశానికి మద్దతు నిచ్చింది. కమ్యూనిస్టు పార్టీల ఐక్యత కోసం రాజేశ్వరరావు ఎంతగానో కృషి చేశారు. కాని ఆ ప్రయత్నం సఫలీకృతం కాలేదు.
1990లో ఆయన వయోభారం వల్ల పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి వైదొలిగారు. 1990లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం కావడం, ఎల్త్సిన్ పెట్టుబడిదారీ విధానాలను అనుసరించడం రాజేశ్వరరావుని కుంగదీసింది. మక్దుం భవన్లో ఆయన్నొకసారి కలిసినప్పుడు ‘సోవియట్ యూనియన్లో జరుగుతున్న పరిణామాలను, ప్రజల్లో పేరుకుపోయిన అసంతృప్తిని అర్థం చేసుకోలేక పోయినందుకు విచారాన్ని వ్యక్తం చేశారు. ఆయన కోరిక మీద రెండు కాలనీల్లో సమావేశాలు ఏర్పాటు చేశాను. ఆ సమావేశాల్లో ఆయన రాజకీయాల గురించి కాకుండా, సామాజిక అంశాలైన కులం, మతం, ప్రాంతం వంటి దురభిమానాల పట్ల విచారం వ్యక్తం చేస్తూ, ప్రజలు వాటి విపరీత పోకడలను ఎదుర్కోవాలని చెప్పారు. ఆ తర్వాత ఆయన జబ్బు పడి, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ 1994 ఏప్రిల్ 9 న మరణించారు. నిరాడంబరంగా జీవిస్తూ, సుదీర్ఘ కాలం పాటు భారత కమ్యూనిస్టు పార్టీకి నాయకత్వం వహించి, ఎంతో ధైర్యంగా పరిస్థితుల్ని ఎదుర్కొన్నారు. ఆయన రాసిన వీలునామా అందరినీ ఆశ్చర్య పరచింది. ఆయన పాటించిన విలువలకు అద్దం పట్టింది. తాను నమ్మిన సిద్ధాంతాల కోసం నిరంతరం కృషి చేసిన ఆయన జీవితం ధన్యం. అందరికీ ఆదర్శప్రాయం.
(నేడు జయంతి సందర్భంగా)