. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు
. విపత్తుల నిర్వహణ విభాగం బలోపేతం
. ఉన్నత స్థాయి సమీక్షలో మంత్రి పొంగులేటి
విశాలాంధ్ర-హైదరాబాద్ : ఈ ఏడాది రాష్ట్రంలో అధిక వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ( ఐఎండీ) హెచ్చరికల నేపథ్యంలో గోదావరి కృష్ణా నదీ పరివాహాక ప్రాంతాల్లో వీలైనంతవరకు ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. గోదావరి, కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాల్లో వరద నిర్వహణపై ఆయా జిల్లాల కలెక్టర్లతో గురువారం సచివాల యంలోని తన ఛాంబర్లో మంత్రి … రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ హరీష్, అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ నాగిరెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్, పంచాయతీరాజ్ కమిషనర్ సృజన, సీపీ డీసీఎల్ డైరెక్టర్ ముష్రాఫ్ అలీ, వ్యవసాయ సహకార శాఖ డైరెక్టర్ బి. గోపి. ఐఎండీ అధికారిణి నాగరత్నంతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. పొంగులేటి మాట్లాడుతూ ప్రకృతి విపత్తుల వల్ల నష్టం జరిగిన తర్వాత స్పందించేదానికంటే నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాలలో విపత్తుల నిర్వహణా విభాగం బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై అన్ని శాఖల కమిషనర్లతో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ కమిటీ వారం రోజుల్లో నివేదిక ఇస్తుందని, దాని ప్రకారం చర్యలు చేపడతామని తెలిపారు. కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, అన్ని విభాగాలతో సమన్వయం చేసుకొని ప్రకృతి వైపరీత్యాల ప్రభావం వీలైనంతవరకు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. జులై, ఆగస్టు, సెప్టెంబర్ హఠాత్తుగా వచ్చే వర్షాల వల్ల ఊహించని వరదలు వస్తున్నాయని, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ముఖ్యంగా పరీవాహక ప్రాంతాల్లోని నివాసితులను గుర్తించి వారిని అక్కడి నుంచి శాశ్వతంగా తరలించి వారికి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇచ్చే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. హైదరాబాద్లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్, కంట్రోల్ సెంటర్కు … ముందస్తు హెచ్చరికల కోసం అవసరమైన యూజర్ ఐడీలను ఇవ్వాలని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆపద మిత్ర వాలంటీర్స్, ఫైర్ సహాయంతో సామాజిక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. కాల్వలు, డ్రెయిన్లు మరమ్మత్తులు చేపట్టాలన్నారు. బోట్లు, ల్కెఫ్ జాకెట్లు, ఆహార కిట్లు ముందే సిద్ధంగా ఉంచాలన్నారు. వరద భద్రత పై తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రజలతో సమావేశాలు, పబ్లిక్ అడ్రస్ సిస్టంల ద్వారా అవగాహన కల్పించాలన్నారు. మొబైల్ వైద్య బృందాలు, మందులు, నీటి శుద్ధి మాత్రలు, పారిశుద్ధ్య కిట్లు అందుబాటులో ఉంచాలన్నారు. ఆదిలాబాద్ , భద్రాద్రి కొత్తగూడెం, జోగులాంబ గద్వాల్, ములుగు, నిర్మల్, వనపర్తి జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.