. ఎక్సైజ్ ఆదాయంలో లీకేజీలు సరిచేయండి
. ట్రైబల్ సొసైటీల్లో నిజమైన లబ్ధిదారులను గుర్తించండి
. రిసోర్స్ మొబలైజేషన్ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో భట్టి
విశాలాంధ్ర – హైదరాబాద్: గత ఏడాదితో పోలిస్తే వాణిజ్య పన్నులశాఖలో ఆరుశాతం ప్రగతి కనిపించిందని, ఇది శుభపరిణామం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. అంబేద్కర్ సచివాలయంలో సోమవారం డిప్యూటీ సీఎం అధ్యక్షతన రిసోర్స్ మొబలైజేషన్ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. కమిటీ సభ్యులు… మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. మార్చిలో సీఎస్టీ, వ్యాట్ ఓవరాల్ గ్రోత్ రూ.600 కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకోగా రూ. 500 కోట్ల ఆదాయం రాష్ట్ర ఖజానాకు సమకూరిం దన్నారు. భవిష్యత్తులోనూ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని డిప్యూటీ సీఎం సంబంధిత అధికారులకు సూచిం చారు. ఎక్సైజ్ ఆదాయం పెంచుకునే క్రమంలో ఎక్కడైనా లీకేజీలు ఉంటే వాటిని గుర్తించి సరి చేయాలని ఆదేశిం చారు. అపార్ట్మెంట్లు, ఫ్లాట్ల విక్రయాల్లో మంచి ప్రగతి కనిపిస్తున్నప్పటికీ వ్యవసాయ భూములు, ఓపెన్ ఫ్లాట్స్ విక్రయాల్లో ఆశించినంత వేగం లేదని, విశ్లేషించి తగిన చర్యలు తీసుకోవాలని మంత్రుల బృందం అధికారులను ఆదేశించింది. రవాణా శాఖలో ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ వివిధ శాఖల్లోనూ విస్తృతంగా వినియోగించుకుని, పెద్ద మొత్తంలో తనిఖీలు చేపట్టాలని సూచించారు. గిరిజన సొసైటీల ద్వారా ఇసుక అమ్మకాలు జరపాలని, నిజమైన వారిని గుర్తించి ట్రైబల్ సొసైటీ లో సభ్యులుగా చేర్చాలని, అసలైన గిరిజనులకు ఆదాయం సమకూరేలా చర్యలు చేపట్టాలని మంత్రుల బృందం ఆదేశించింది. జిల్లా కేంద్రాల్లో విలువైన భూములను గుర్తించి వాటిని సంరక్షించే బాధ్యతలు చేపట్టాలని రెవెన్యూ అధికారులను బృందం ఆదేశించింది. నిర్మాణం అనుమతుల విషయంలో హెచ్ఎండీఏ వేగం పెంచాలని సూచించింది. చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ఆర్అండ్బి ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్, సీసీఎల్ఎ కమిషనర్ నవీన్ మిట్టల్, కమర్షియల్ టాక్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ, మైన్స్ అండ్ జియాలజీ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్ కుమార్, కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ హరిత, ట్రాన్స్పోర్టు కమిషనర్ సురేంద్రమోహన్, రిజిస్ట్రేషన్ కమిషనర్ బుద్ధ ప్రకాశ్జ్యోతి, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ పాల్గొన్నారు.