Thursday, June 5, 2025
Homeవిజయవాడ నుంచి ఓర్వకల్లుకు విమానం

విజయవాడ నుంచి ఓర్వకల్లుకు విమానం

జులై 2 నుంచి ప్రారంభం… పోస్టరు ఆవిష్కరించిన మంత్రి భరత్‌

విశాలాంధ్ర బ్యూరో - అమరావతి: విజయవాడకర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయానికి జులై 2వ తేదీ నుంచి విమాన సర్వీసులు నడుపుతామని, ఇందుకు కేంద్ర విమానయాన శాఖ అంగీకరించిందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖ మంత్రి టీజీ భరత్‌ చెప్పారు. మంగళగిరి ఏపీఐఐసీ కార్యాలయంలో విజయవాడ-కర్నూలు విమాన సర్వీసుల పోస్టరును మంగళవారం ఆయన ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ విజయవాడ నుంచి కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయానికి విమాన సర్వీసులు నడిపేందుకు కేంద్ర విమాన యాన శాఖ అంగీకరించిందన్నారు. ఈ సర్వీసు విజయవాడలో మధ్యాహ్నం 3.45 గంటలకు బయలుదేరి ఓర్వకల్లుకు 4.50 గంటలకు చేరుకుంటుందని, సాయంత్రం 5.10 గంటలకు ఓర్వకల్లులో బయలుదేరి విజయవాడకు 6.15 గంటలకు వస్తుందని వివరించారు. విమాన టికెట్‌ ధర రూ.2,533 నుంచి మొదలవుతాయన్నారు. మొదటగా ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో ఇండిగో విమాన సర్వీసు నడుస్తుందని, రానున్న రోజుల్లో ప్రతిరోజూ విమాన సర్వీసు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. రాయలసీమను అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని మంత్రి టీజీ భరత్‌ అన్నారు. రాయలసీమకు భారీగా పరిశ్రమలు రానున్నాయని, ఇప్పటికే వేలాది కోట్ల రూపాయల పెట్టు బడులు వచ్చాయన్నారు. లేపాక్షి నుంచి కొప్పర్తి, ఓర్వకల్లు వరకు ఇండస్ట్రియల్‌ కారిడార్‌ ఎంతో అభివృద్ధి చెందుతోందని, ఈ ప్రాంతంలో డిఫెన్స్‌, డ్రోన్‌, ఎలక్ట్రిక్‌, గ్రీన్‌ ఎనర్జీకి సంబంధించిన పరిశ్రమలు వస్తాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం 2.0 పాలసీ విడుదల చేసిన వెంటనే ఈ పరిశ్రమకు సంబంధించిన పనులు ప్రారంభమవుతాయన్నారు. త్వరలోనే హైకోర్టు బెంచ్‌ కర్నూలులో ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి చెప్పారు. ఇండిగో విజయవాడ సేల్స్‌ మేనేజర్‌ మోహిత్‌ కృష్ణ, కర్నూలు సేల్స్‌ మేనేజర్‌ రవిబాబు, విమానాశ్రయ అసిస్టెంట్‌ మేనేజర్‌ సుభాని, సుజన్‌ పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు