Friday, June 6, 2025
Homeవిజయోత్సవంలో విషాదం

విజయోత్సవంలో విషాదం

చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట
11 మంది మృతి 50 మందికి గాయాలు

రూ.10 లక్షల పరిహారం ప్రకటించిన సీఎం
న్యాయ విచారణకు ఆదేశాలు

బెంగళూరు: కర్నాటకలో రాయల్‌ ఛాలెంజర్స్‌ (ఆర్‌సీబీ) విజయోవత్సంలో విషాదం చోటుచేసుకుంది. అమితాభిమానం ప్రాణాలు హరించింది. ఐపీఎల్‌లో తొలిసారి గెలిచిన ఆర్‌సీబీ విజయోత్సవాల్లో పాల్గొనేందుకు అభిమానులు వేలాది సంఖ్యలో బెంగళూరు ఎం.చిన్నస్వామి స్టేడియానికి చేరుకున్నారు. తమ అభిమాన క్రీడాకారులను చూసేందుకు ఎగబడ్డారు. మైదానం కిక్కిరిసి ఉండటంతో గేటు విరిగి తొక్కిసలాట జరిగింది. దీంతో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 50 మందికిపైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరుగుతుండటంతో ఈ ఘటన సంచలనంగా మారింది. గాయపడిన వారిని శివాజీనగర్‌లోని బౌరింగ్‌ ఆసుపత్రికి తరలించారు. అంతా చూస్తుండగానే స్టేడియం వద్ద పరిస్థితి అదుపు తప్పింది. అభిమానులు స్టేడియం గేట్ల వైపు దూసుకురావడంతో తొక్కిసలాట జరిగింది. పోలీసులు లాఠీచార్జికి యత్నిస్తుండగానే కొందరు స్పృహ కోల్పోయారు. కింద పడిన వారిని పట్టించుకోకుండా జనం తొక్కుకుంటూ వెళ్లారు. అభిమానులను పోలీసులు నియంత్రించలేకపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. 18 ఏళ్ల తర్వాత ఐపీఎల్‌ కప్పును ఆర్‌సీబీ గెలవడంతో ఓపెన్‌ టాప్‌ బస్సులో ర్యాలీ నిర్వహించాలని కర్నాటక ప్రభుత్వం భావించింది. కానీ ఈ విషాదం కారణంగా దానిని రద్దు చేసుకున్నది. విధాన సౌధలో ఆటగాళ్లను సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ సన్మానించారు. అక్కడ నుంచి విక్టరీ పరేడ్‌… చిన్నస్వామి స్టేడియం వద్ద ఘనంగా ముగుస్తుందని భావించారు. కానీ ఊహించిన దాని కంటే అధిక సంఖ్యలో అభిమానులు రావడంతో వారిని నియంత్రించడం బెంగళూరు పోలీసులకు కష్టసాధ్యమైంది.
ప్రధాని సహా ప్రముఖుల దిగ్భ్రాంతి
ఈ విషాదంపై ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ సహా అనేక మంది రాజకీయ నాయకులు, ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘బెంగళూరు ఘటన కలచివేసింది. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. గాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా’ అని మోదీ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ కూడా ఎక్స్‌ మాధ్యమంగా విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన దురదృష్టకరం, హృదయ విదారకమని పోస్టులు పెట్టారు.
ప్రాణాల కంటే విలువైనదేమీ లేదు: రాహుల్‌
బెంగళూరు ఘటన హృదయవిదారకమని లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ గాంధీ ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. ఈ విషాద సమయంలో బెంగళూరు ప్రజలకు సానుభూతి ప్రకటించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలని కోరారు. ప్రజల ప్రాణాల కంటే విలువైన వేడుక ఏమీ ఉండదని రాహుల్‌ పేర్కొన్నారు.
క్షమించండి… ఇది ఊహించలేదు: డీకే
ఈ ఘటన కోసం పోలీసులను నిందించలేమని, అభిమానులు పెద్దసంఖ్యలో రావడంతో వారిని అదుపు చేయలేకపోయారని డీకే శివకుమార్‌ అన్నారు. ఈ ఘటనకుగాను క్షమాపణలు చెప్పారు. మొత్తం ఐదు వేల మంది పోలీసులను మోహరించినట్లు తెలిపారు. ‘గ్రౌండ్‌లో పరిస్థితిని ప్రత్యక్షంగా చూశాం. అభిమానులతో మెట్రో స్టేషన్లు కిక్కిరిశాయి. ట్రాఫిక్‌ జామ్‌లు సంభవించాయి. అనూహ్య స్పందనతో అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం కార్యక్రమం జరగలేదు. చేయగలిగినదంతా చేశాం కానీ అభిమానులు ఎక్కువగా ఉండటంతో పోలీసులు నియంత్రించలేకపోయారు. కార్యక్రమాన్ని 10`15 నిమిషాల్లో ముగించేశాం’ అని ఉప ముఖ్యమంత్రి వివరించారు. అనంతరం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు.
రాజకీయం చేయొద్దు: బీసీసీఐ ఉపాధ్యక్షుడు
తొక్కిసలాట ఘటనకు కర్నాటక ప్రభుత్వాన్ని నిందించరాదని, దీనిని రాజకీయం చేయొద్దని బీసీసీఐ ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్‌ ఎంపీ రాజీవ్‌ శుక్లా కోరారు. ‘అధికారంలో ఏ పార్టీ ఉన్నదన్నది ముఖ్యం కాదు. ఇలాంటి ఘటన ఏ రాష్ట్రంలోనైనా జరగవచ్చు. దీనిని రాజకీయం చేయొద్దు. బీజేపీ పాలిత రాష్ట్రంలో ఇలాంటిది జరిగినాగానీ వారిని నిందించరాదు. ఊహించని విధంగా అభిమానాలు వచ్చారు కాబట్టే ఇలా జరిగింది. నేను ఫ్రాంచైజీతోనూ మాట్లాడాను. ఇంత భారీ సంఖ్యలో జనం వస్తారని వారూ ఊహించలేదు. ఇదంతా ఆకస్మికంగా జరిగిపోయింది. బాధిత కుటుంబాలకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించేం దుకు ఏర్పాట్లు జరిగాయి’ అని శుక్లా అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు