పట్టణ సామాజిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
విశాలాంధ్ర – హైదరాబాద్ : రాష్ట్ర ప్రభు త్వం వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. బుధవారం హైదరా బాద్ శ్రీరామ్ నగర్ పట్టణ సామాజిక ఆరోగ్య కేంద్రంను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని ఫార్మసీ, ప్రాథమిక పరీక్ష గది, ఎక్స్రే, ఈసీజీ గదులను పరిశీలించారు. అటెండెన్స్ రిజిస్టర్ తనిఖీ చేసి రిజిస్టర్లో సంతకం చేసిన ప్రకారం వైద్యులు, సిబ్బంది ఉన్నారా లేదా అని చూశారు. ఆస్పత్రిలో వైద్య సేవల కోసం వచ్చిన గర్భిణీలతో ఆస్పత్రిలో అందిస్తున్న వైద్య సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, రోగు లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలని అన్నారు. ఆసుపత్రిలో మందుల కొరత లేకుండా స్టాక్ పూర్తికాకముందే ఇండెంట్ చేసి మందులను తెప్పించుకోవాలన్నారు. గర్భిణీల చక వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని అన్నారు. ఆస్పత్రిలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. శానిటేషన్ సిబ్బంది తమకు కొన్ని నెలలుగా వేతనం రావడం లేదని కలెక్టర్కు తెలుపగా వేతనం మంజూరు కోసం, అలాగే అంబులెన్స్ మరమ్మతుల కోసం ప్రతిపాదనలు, ఆస్పత్రికి చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి పెషెంట్స్ అధికంగా వస్తున్నందున ఆస్పత్రిని 50 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దేందుకు, ఆస్పత్రికి అదనంగా మరొక గైనకాలజిస్ట్ కోసం ప్రతిపాదనలు సమర్పించాలని డిసిహెచ్ఎస్ను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ డిసిహెచ్ఎస్ డాక్టర్ రాజేంద్రనాథ్, ఆస్పత్రి సూపర్డెంట్ డాక్టర్ నవనీతరావు, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.