. జనాభా దామాషా ప్రకారం నిధులు
. ప్రజల అజెండా మేరకే పాలన
. కులగణన దేశానికే ఆదర్శం: భట్టి
విశాలాంధ్ర బ్యూరో-ఖమ్మం : రాబోయే బడ్జెట్లో రాష్ట్రంలో జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయించి విద్య, ఉపాధి, సంక్షేమ రంగాల్లో అవకాశాలు పెరిగేలా కృషి చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మంలో గౌడ సంఘం భవన నిర్మాణ పనులకు సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో భట్టి మాట్లాడుతూ… సమాజంలో అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించి సమ సమాజాన్ని స్థాపించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ప్రజల అజెండానే చట్టంగా చేసి పాలన సాగిస్తామ న్నారు. అధికారంలోకి రాగానే బీసీ కులగణన చేసి … జనాభాలో 56 శాతం ఉన్నారని లెక్క తేల్చినట్టు తెలిపారు. స్థానిక సంస్థలు, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం చేసి కేంద్రానికి పంపామని చెప్పారు. తెలంగాణ మోడల్ దేశవ్యాప్తంగా జరగాలి అని రాహుల్ గాంధీ చెప్పింది ఇప్పుడు అది దేశానికే దిక్సూచిగా మారిందని పేర్కొన్నారు. ఇది తెలంగాణ ప్రజల విజయం అని అన్నారు. బీసీ కుల గణన తెలంగాణ నుంచే మొదలుపెడతా మని రాహుల్ హామీ ఇచ్చిన మేరకు అధికా రంలోకి రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్వర్యంలో యావత్ క్యాబినెట్ ఏకగ్రీవంగా ఆమోదించి శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టామని తెలిపారు. 50 రోజుల్లోనే చిన్న పొరపాటు లేకుండా విజయవంతంగా సర్వే పూర్తి చేసి దేశ చరిత్రలోనే రికార్డు సృష్టించామని తెలిపారు. స్వాతంత్రం వచ్చాక ఏ రాష్ట్రంలో కుల గణనకు ఎవరూ సాహసం చేయలేదని చెప్పారు. శాస్త్రీయంగా సర్వే పూర్తి చేసినట్టు తెలిపారు. ఏడాది లోపలోనే గౌడ సంఘ భవనం నిర్మాణం పూర్తి చేసుకోవాలని సూచించారు. ఇక్కడే నిరుద్యోగులకు ఒక శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. సహకారాన్ని ప్రభుత్వం పూర్తిస్థాయిలో అందిస్తుందని భరోసా ఇచ్చారు. చైతన్యానికి మారుపేరు, బలహీన వర్గాలకు పుట్టినిల్లు ఖమ్మం జిల్లా అని తెలిపారు. ధీరోదాతుడైన సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని బలహీన వర్గాలు స్ఫూర్తిని పొందాలి అన్నారు.