Thursday, May 8, 2025
Homeసైన్యానికి అండగా ఉందాం…

సైన్యానికి అండగా ఉందాం…

న్యూదిల్లీ:పహల్గాం దాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర శిబిరాలపై భారత్‌ సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’ను కాంగ్రెస్‌ పార్టీ స్వాగతించింది. ఈ విషయంలో తమ పార్టీ తరఫున సైనికులకు పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది. భారత్‌ చేపట్టిన దాడుల నేపథ్యంలో సీడబ్ల్యూసీ బుధవారం అత్యవసరంగా సమావేశమైంది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, జైరాం రమేశ్‌, కేసీ వేణుగోపాల్‌, సచిన్‌ పైలట్‌ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు.
అనంతరం ఖడ్గే, రాహుల్‌ గాంధీ విలేకరులతో మాట్లాడారు. ఉగ్రవాద స్థావరాలపై ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరుతో సాహసోపేత నిర్ణయం తీసుకున్న భారత సాయుధ దళాలను చూసి తాము గర్విస్తున్నామని ఖడ్గే అన్నారు. దేశ ఐక్యత, సమగ్రతను కాపాడడానికి అన్ని స్థాయిల్లో ఐక్యంగా ఉండాలన్నారు. దేశ రక్షణ, ఐక్యత, స్వేచ్ఛను కాపాడటానికి తమ పార్టీ తరఫున సైనికులకు పూర్తి మద్దతు ఇస్తున్నామని వెల్లడిరచారు. సాయుధ దళాలకు కాంగ్రెస్‌ పార్టీ తరఫున పూర్తి మద్దతు ఉంటుందని రాహుల్‌ గాంధీ కూడా ప్రకటించారు. మన సాయుధ బలగాలను చూసి గర్విస్తున్నాన్నారు. సైన్యం తీసుకున్న చర్యల్ని ఆయన ప్రశంసించారు. విజయవంతంగా ఆపరేషన్‌ నిర్వహించిన భద్రతా దళాలకు చాలా ప్రేమతో శుభాకాంక్షలు చెబుతున్నానని అన్నారు. గురువారం కేంద్రం నిర్వహించే అఖిల పక్ష సమావేశానికి కాంగ్రెస్‌ పార్టీ హాజరవుతుందని రాహుల్‌ గాంధీ ధ్రువీకరించారు.
శరద్‌పవార్‌ హర్షం
భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’పై ఎన్‌సీపీ (ఎస్‌పీ) అధినేత శరద్‌పవార్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ చర్య ద్వారా భారత్‌ శక్తి సామర్థ్యాల గురించి ప్రపంచానికి సందేశం ఇచ్చినట్లయిందన్నారు. ఈ పరీక్షా సమయంలో తాను ప్రధాని మోదీ, రక్షణమంత్రి రాజ్‌నాథ్‌కు ఫోన్‌చేసి పూర్తి మద్దతు ఇస్తున్నట్లు తెలిపానని పవార్‌ వెల్లడిరచారు. కాగా ‘జై హింద్‌, జై ఇండియా’ అని పశ్చిమ్‌ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోస్టు పెట్టారు.
ఉగ్రవాదాన్ని అంతం చేస్తాం: అమిత్‌షా
కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ‘ఎక్స్‌’ వేదికగా స్పందిస్తూ… ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలిస్తామని తీవ్ర హెచ్చరికలు చేశారు. ఉగ్రవాదులు పాల్పడిన దారుణ హత్యలకు భారత్‌ స్పందనే ఈ ఆపరేషన్‌ అని వ్యాఖ్యానించారు. ‘‘దేశ భద్రతా బలగాల చర్యలపై ఎంతో గర్వంగా ఉంది. పహల్గాంలో చోటుచేసుకున్న దారుణ హత్యలకు ప్రతిస్పందనే ఈ ఆపరేషన్‌. భారత్‌పై, దేశ ప్రజలపై జరిగే ఏ దాడికైనా తగిన ప్రతిస్పందన ఇవ్వడానికి మోదీ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించడానికి భారత్‌ కట్టుబడి ఉంది’’ అని వెల్లడిరచారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు