అక్రమ కేసులకు భయపడేది లేదన్న మాజీ మంత్రి
విశాలాంధ్ర-హైదరాబాద్: మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావుకు ఊరట లభించింది.సిద్ధిపేట ఎమ్మెల్యేగా హరీశ్రావు ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్ను రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. 2023 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన గెలుపు చెల్లదంటూ బీఎస్సీ అభ్యర్థిగా పోటీ చేసిన ప్రస్తుత కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ పిటిషన్ దాఖలు చేశారు. హరీశ్రావు తన ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారాన్ని అందించారని… అతని ఎన్నికను రద్దు చేయాలని కోర్టును కోరారు. సదరు పిటిషన్ పై మంగళవారం విచారణ జరిపిన హైకోర్టు సరైన ఆధారాలు లేకపోవడంతో చక్రధర్ గౌడ్ పిటిషన్ను కొట్టివేస్తున్నట్లు తీర్పునిచ్చింది. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ తప్పుడు కేసులు పెడుతోందని హరీశ్రావు ఆరోపించారు. ఇలాంటి కేసుల్లో ఎప్పటికైన న్యాయమే గెలుస్తుందని మరోసారి రుజువైందని, ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పెడుతున్న అక్రమ కేసులు న్యాయస్థానాల్లో వీగిపోతున్నాయన్నారు. అక్రమ కేసులతో ప్రతిపక్ష నాయకులపై కుట్రలు చేస్తున్న సీఎం.రేవంత్రెడ్డి కుట్రలు ఫలించడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకులపై కక్ష సాధింపు రాజకీయాలు మానుకొని ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంపై దృష్టి సారించాలని హరీశ్ రావు సూచించారు. అక్రమ కేసులకు భయపడేది లేదని, ప్రజా క్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ నయవంచనను ఎండగట్టి తీరుతామ న్నారు. ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.