రణరంగమైన పశ్చిమాసియా ` గాజాపై కొనసాగిన ఇజ్రాయిల్ భీకర దాడులు
జెరూసలేం: పశ్చిమాసియా రణరంగమైంది. గాజాపై ఇజ్రాయిల్ గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు జరిపిన భీకర దాడుల్లో 100 మంది పలస్తీనియన్లు చనిపోయారు.దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్, దేర్ అల్-బలా నగర శివార్లపై ఇజ్రాయిల్ వైమానిక దాడులు చేసింది. 48 మృతదేహాలను ఇండోనేషియా ఆసుపత్రికి తీసుకెళ్లగా… మరో 16 మృతదేహాలను నాసర్ ఆసుపత్రికి తరలించారని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. శిథిలాల కింద పదుల సంఖ్యలో ప్రజలు చిక్కుకుపోగా వారిలో ఎవరూ ప్రాణాలతో లేరని తెలుస్తోంది. తాజా పరిస్థితిపై హమాస్ తీవ్రస్థాయిలో ఆవేదన వ్యక్తంచేసింది. ఇజ్రాయిల్ అమానవీయతను ఎండగట్టాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరింది. హమాస్ అంతమే లక్ష్యంగా దాడులను మరింతగా విస్తరించేందుకు కట్టుబడి ఉన్నట్లు ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. ఇజ్రాయిల్ దాడుల్లో ఇప్పటివరకు 53,010 మంది పలస్తీనియన్లు చనిపోగా, గాయపడిన వారి సంఖ్య 1,19,919కు పెరిగిందని గాజా ఆరోగ్యశాఖ వెల్లడిరచింది. అయితే శిథిలాల కింద చిక్కుకున్న వారిలో ఎవరూ ప్రాణాలతో లేరన్న అంచనా మేరకు మృతుల సంఖ్యను 61,700గా సవరించి ప్రభుత్వ మీడియా కార్యాలయం ఒక ప్రకటన చేసింది.
పలస్తీనియన్లకు సాయం అవశ్యం: ట్రంప్
పశ్చిమాసియా పర్యటన వేళ పలస్తీనియన్ల దీనస్థితిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ వారికి సాయం అవసరమని అన్నారు. గాజా ప్రజలు పస్తులు ఉంటున్నారని, వారికి సహాయాన్ని అందించడం తక్షణాశ్యమన్నారు. గాజాపై ఇజ్రాయిల్ దురాక్రమణను సమర్థిస్తారా అన్న ప్రశ్నకు ‘వచ్చే నెలలో చాలా మంది పనులు జరుగుతాయి’ అని ట్రంప్ బదులిచ్చారు. ‘మనం పలస్తీనియన్లకు సాయం అందించాలి. గాజా ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు కాబట్టి రెండు పక్షాలను దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్లడం అవసరం’ అని ట్రంప్ తెలిపారు. గాజాను స్వేచ్ఛా మండలంగా మార్చేందుకు కృషి చేస్తానని, గాజాకు సంబంధించి తనకు మంచి ఆలోచనలు ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు వెల్లడిరచారు.