4 వేలు దాటిన కోవిడ్ కేసులు: కేరళలోనే అత్యధికం
న్యూదిల్లీ : దేశ రాజధాని దిల్లీ, గుజరాత్, మహారాష్ట్రలో కోవిడ్ కేసులు పెరిగిపోతున్నాయి. అత్యధిక ప్రభావిత రాష్ట్రంగా కేరళ ఉంది. అత్యధికంగా 1,416 కేసులు ఆ రాష్ట్రంలో నమోద య్యాయి. దేశవ్యాప్తంగా 4,026 కోవిడ్ కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం నివేదించింది. గత 24 గంటల్లో ఐదు మరణాలు సంభవించినట్లు పేర్కొంది. జనవరి నుంచి మొత్తం 37 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. మే 22న 257 మంది రోగులు ఉంటే మే 31 తేదీకి ఆ సంఖ్య 3,395కు పెరిగింది. ప్రస్తుతం 4,026 మంది రోగులున్నారు. దేశంలోనే అత్యధికంగా 1,416 కేసులు కేరళలో నమోదు కాగా మహారాష్ట్రలో 493, గుజరాత్లో 397, దిల్లీలో 393 కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో ఒకరు చొప్పున కోవిడ్తో మరణిస్తే, మహారాష్ట్రలో ఇద్దరు చనిపోయినట్లు డేటా చెబుతోంది. దేశంలో కోవిడ్ వ్యాప్తిగతిని నిశితంగా గమనిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇన్ఫెక్షన్ల తీవ్రత తక్కువగానే ఉందని, ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నాయి. ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ భెల్ స్పందిస్తూ ఒమిక్రాన్ సబ్ వేరియంట్లతోనే ప్రస్తుతం కేసులు పెరుగుతున్నట్లు పశ్చిమం, దక్షిణాని నుంచి సేకరించిన నమూనాల జినోమ్ సీక్వెన్సింగ్ ద్వారా నిర్థారణకు వచ్చినట్లు చెప్పారు. కేసులు పెరుగుతున్నా…వైరస్ తీవ్రత ఎక్కువగా లేదని తెలిపారు. ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు ఎల్ఎఫ్.7, ఎక్స్ఎఫ్జీ, జేఎన్.1, ఎన్బీ.1.8.1ను గుర్తించినట్లు డాక్టర్ రాజీవ్ అన్నారు. ఎన్బీ.1.8.1 వ్యాప్తి తక్కువగా ఉందని, మిగతా మూడు వేరియంట్లు ఎక్కువగా వ్యాపిస్తున్నాయని చెప్పారు. అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారని, భయపడాల్సిన అవసరం లేదని డాక్టర్ రాజీవ్ వెల్లడిరచారు.