. గిరిజన నియోజకవర్గాలకు అదనంగా 500 నుంచి 700
. చెంచు కుటుంబాలకు 10 వేలు
. గవర్నర్కు మంత్రి పొంగులేటి
విశాలాంధ్ర – హైదరాబాద్: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి… ఎంపీ రామసహాయం, రఘురామ్రెడ్డిలతో కలిసి రాజ్భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో బుధవారం భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన భూభారతి చట్టం, ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి ఆయనకు వివరించారు. ప్రతినియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నట్టు చెప్పారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు గిరిజన నియోజకవర్గాలకు అదనంగా 500 నుంచి 700 ఇళ్లు , ఐటీడీఏ పరిధిలో చెంచు కుటుంబాలకు పదివేల ఇళ్లు మంజూరు చేస్తున్నామని వివరించారు. మొదటిదశలో అత్యంత నిరుపేదలకు ప్రాధాన్యతాక్రమంలో ఇళ్లు మంజూరు చేస్తున్నామని తెలిపారు. గవర్నర్ దత్తత తీసుకున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పూసుకుంట గ్రామం, గోగులపూడి, ఆదిలాబాద్ జిల్లా భుర్కి, మంగ్లీ, నాగర్కర్నూల్ జిల్లా అప్పాపూర్, బౌరాపూర్ గ్రామాల్లో కూడా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామన్నారు. రాష్ట్రంలో నెలకొన్న భూసమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న లక్ష్యంతో తీసుకు వచ్చిన భూభారతి చట్టాన్ని గత నెల 17 నుంచి నాలుగు మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేశామని తెలిపారు. ఈనెల ఐదో తేదీ నుంచి 28 మండలాల్లో అమలు చేస్తున్నామని వివరించారు. ఎలాంటి రుసుం లేకుండానే ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. గవర్నర్ను కలిసిన వారిలో ఐడీసీ చైర్మన్ మువ్వ విజయబాబు, హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వి.పి.గౌతమ్ ఉన్నారు.