ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల స్థాపనకు ఐదు సంస్థలు ముందుకు వచ్చాయని, చేనేత రంగంలో రూ.2 వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ఆ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. త్వరలో ఆ సంస్థలతో ఎంవోయూలు చేసుకోబోతున్నామని, ఆయా కంపెనీల ఏర్పాటుతో 15 వేల మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయని చెప్పారు. న్యూఢిల్లీలో జరుగుతున్న ఇంటర్నేషనల్ భారత్ టెక్స్-2025 ఎగ్జిబిషన్లో మంత్రి సవిత రెండో రోజు సోమవారం కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎగ్జిబిషన్లో పాల్గొన్న పలువురు దేశ, విదేశ పెట్టుబడుదారులతో మంత్రి సమావేశమయ్యారు. రాష్ట్రంలో సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలో పరిశ్రమల ఏర్పాటుకు తీసుకుంటున్న చర్యల గురించి, చేనేత రంగంలో అవకాశాల గురించి వారికి వివరించారు. ఆయా కంపెనీల ప్రతినిధులతో జరిగిన చర్చలు ఫలప్రదం కావడంతో, అడ్వాన్స్ టెక్స్ టైల్స్ అసోసియేషన్, ఐటీఎంఎఫ్, మాస్కో ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ సహా మరో రెండు సంస్థల ప్రతినిధులు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి సుముఖం వ్యక్తం చేశారని తెలిపారు. కర్ణాటకకు చెందిన ప్రతినిధులు ఎమ్మిగనూరు టెక్స్ టైల్స్ పార్క్లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపినట్లు మంత్రి సవిత వెల్లడించారు. రష్యాలో టెక్స్ టైల్స్ వేర్ హౌస్ ఏర్పాటుకు ఏపీకి చెందిన గుంటూరు టెక్స్ టైల్స్ పార్క్ అంగీకారం తెలిపిందని మంత్రి సవిత తెలిపారు.