. 24.65 లక్షల మందికి అదనం
. పథకానికి రూ.10,091 కోట్ల ఖర్చు
. పాఠశాలల అభివృద్ధికి రూ.1,346 కోట్లు
. 20న అన్నదాత సుఖీభవ
. ఆగస్టు 15 నుంచి స్త్రీలకు ఉచిత ప్రయాణం
. త్వరలో నిరుద్యోగ భృతి చెల్లిస్తాం
. సూపర్ సిక్స్ హామీలన్నీ పూర్తి
. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం అమలు చేస్తామని ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సూపర్ సిక్స్లో కీలక హామీని అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, విద్యాశాఖమంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదైన సందర్భంగా గురువారం ఉండవల్లి క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. సూపర్సిక్స్లో కీలకమైన తల్లికి వందనం అమలుకు జీవో విడుదల చేసినట్లు వెల్లడిరచారు. మొత్తం అర్హులైన 67.27 లక్షల మంది విద్యార్థులకు రూ.10,091 కోట్లు తల్లికి వందనం పథకం కింద ఖర్చు చేస్తున్నామని, ఇందులో రూ.1,346 కోట్లు పాఠశాలల అభివృద్ధికి ఖర్చు చేస్తామని తెలిపారు. తల్లికి వందనం పథకానికి, అమ్మఒడి పథకానికి మధ్య చాలా వ్యత్యాసం ఉందన్నారు. గత ప్రభుత్వం కేవలం 42,61,965 మంది విద్యార్థులకు అమ్మఒడి ఇచ్చిందని, తమ ప్రభుత్వం 67,27,164 మంది విద్యార్థులకు ఇస్తోందన్నారు. గత ప్రభుత్వం కంటే 24,65,199 మందికి అదనంగా పథకం వర్తింపచేశామని చంద్రబాబు చెప్పారు. గత ప్రభుత్వం రూ.5,540 కోట్లు దీనికోసం ఖర్చు పెట్టగా… తమ ప్రభుత్వం రూ.8,745 కోట్ల నిధులు జమ చేస్తున్నట్లు వెల్లడిరచారు. వారికంటే రూ.3,205 కోట్లు అదనంగా ఇస్తున్నామని సీఎం తెలిపారు. 1వ తరగతి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులను కూడా పరిగణనలోకి తీసుకున్నామని, స్కూలు అడ్మిషన్లు కాగానే వారికి కూడా డబ్బులు వేస్తామని వివరించారు. తల్లి లేని పిల్లలుంటే తండ్రి, సంరక్షులకు, అనాథ పిల్లలుంటే జిల్లా కలెక్టర్ నిర్దేశించిన వారికి నగదు జమ చేస్తామన్నారు. ప్రైవేటు, అన్ఎయిడెడ్ పాఠశాలలలో చదివే 76 వేల మందికి పథకాన్ని వర్తింపజేస్తున్నామని, పారదర్శకత కోసం లబ్ధిదారుల జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తామని చెప్పారు. సాంకేతిక సమస్యలతో ఎవరికైనా ఇబ్బంది కలిగితే దరఖాస్తు చేసుకున్న వెంటనే పరిష్కరిస్తామని అన్నారు. దీనికోసం ఈ నెల 26 వరకు సమయం ఇస్తున్నామని, 30న తుది జాబితా ప్రకటిస్తామన్నారు.
బలహీన వర్గాలకే అధిక లబ్ధి
67.27 లక్షల మంది విద్యార్థుల్లో 29.82 లక్షల మంది బీసీలు, 11.76 లక్షల మంది ఎస్సీలు, 4.26 లక్షల మంది ఎస్టీలు, 66.50 వేల మంది మైనార్టీలు, 8.44 లక్షల మంది ఈడబ్యూసీ విద్యార్థులు ఉన్నారని చంద్రబాబు చెప్పారు. జనాభా సమతుల్యతలో భాగంగా ఇదొక ముందడుగన్నారు. ఒక కుటుంబంలో ఒక్క బిడ్డ ఉన్న విద్యార్థులు 18,55,760 మంది, ఇద్దరు బిడ్డలు ఉన్న విద్యార్థులు 29,10,644 మంది ఉన్నారని, ముగ్గురు బిడ్డలు ఉన్న విద్యార్థులు 6,32,052 మంది, నలుగురు పిల్లలున్న తల్లులు 80,212 మంది ఉన్నారని చంద్రబాబు వివరించారు.
20న అన్నదాత సుఖీభవ
‘అన్నదాత సుఖీభవ కింద రైతులకు ఏడాదిలో కేంద్రం ఇచ్చే ఆరు వేలతో కలిపి మూడు విడతల్లో మొత్తం రూ.20 వేలు రైతుల ఖాతాల్లో వేస్తాం. ఈ పథకం కూడా ఈనెల 20న అమలు చేస్తాం. గత ప్రభుత్వం రైతులకు ఇచ్చింది కేవలం రూ.7,500 మాత్రమే. వాళ్లకు, మాకు వ్యత్యాసం రూ.6,500. దీపం పథకం కింద ఆడబిడ్డలకు ఉచితంగా మూడు సిలిండర్లు ఇస్తున్నాం. మత్స్యకారుల సేవలో లక్షా 29 వేల 178 మందికి రూ.259 కోట్లు జమ చేశాం. గత ప్రభుత్వం లక్షా 9వేల 231 మందికి రూ.109 కోట్లే ఇచ్చింది. మన ప్రభుత్వం 19,947 మందికి అదనంగా ఇచ్చి రూ.150 కోట్లు ఎక్కువ ఖర్చు చేశాం. పింఛన్ల కింద గత పాలకులు ఏడాదికి రూ.21,631 కోట్లు ఖర్చు చేస్తే… కూటమి ప్రభుత్వం రూ.34 వేల కోట్లు ఇచ్చింది. రూ.12,370 కోట్లు అధికంగా ఖర్చు చేస్తున్నాం. బటన్ నొక్కామని గొప్పలు చెప్పిన వారికి మేం అందించే సంక్షేమ కార్యక్రమాలు అర్థం కావాలి’ అని చంద్రబాబు అన్నారు. ఆగస్టు 15 నుంచి సూపర్ సిక్స్లో భాగమైన ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణంతో పాటు త్వరలో నిరుద్యోగ భృతి హామీ కూడా అమలు చేస్తామని చెప్పారు. ఆడబిడ్డకు నిధి పీ`4తో లింకు చేస్తామన్నారు. వీటితో సూపర్ సిక్స్ హామీలన్నీ అమలు చేసినట్లవుతుందని, ఇక దీని గురించి ఎవరూ మాట్లాడే అవకాశం ఉండదన్నారు.
ఇప్పటిదాకా నా మంచి తనమే చూశారు
‘ప్రజా భద్రత, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చూస్తూ ఊరుకోను. వైసీపీ హయాంలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది చాలక కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం చూసి ఓర్వలేక రాక్షసుల మాదిరి రాష్ట్రంలో కుట్రలు చేస్తున్నారు’ అని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రౌడీయిజం చేసి పెత్తనం చేయాలంటే ఆటలు సాగనివ్వను. ఇప్పటివరకూ నా మంచితనం చూశారు. ఇకపై ఉపేక్షించను’ అని సీఎం చంద్రబాబు తీవ్రంగా హెచ్చరించారు. ఏడాది పాలనలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ఏపీకి వచ్చిన పెట్టుబడులు, అమలు చేసిన సంక్షేమ పథకాలను మంత్రి లోకేశ్ వివరించారు.