అక్టోబర్ 2న తూర్పు గోదావరి జిల్లాలో కాటన్ బ్యారేజీపై పవన్ కళ్యాణ్ చేయబోయే శ్రమదానానికి అధికారులు అనుమతి నిరాకరించారు. ఇరిగేషన్ ఎస్ఈ శ్రమదానానికి అనుమతి లేదని ప్రకటించారు. సరైన సాంకేతిక పరిజ్ఞానం లేకుండా గుంతలను పూడ్చితే బ్యారేజీకి నష్టం కలుగుతుంది..కాబట్టి అనుమతి కుదరదని స్పష్టం చేశారు. మరోవైపు జనసేన కార్యకర్తలు బ్యారేజీపై శ్రమదానం చేసి తీరతామని చెబుతున్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2వ తేదీన రాష్ట్రంలో రెండు ప్రాంతాల్లో శ్రమదానం చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. పాడైన రోడ్లకు మరమ్మతులు చేసే కార్యక్రమంలో పాల్గొని ఆయన శ్రమదానం చేయాలని భావించారు. ఆ రోజు ఉదయం 10గంటలకు తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజీపై దెబ్బ తిన్న రహదారికి మరమ్మతులు చేసే కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ శ్రమదానం చేయతలపెట్టారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు అనంతపురం జిల్లాలో చేపట్టే శ్రమదానం కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది.