అఖిలపక్ష భేటీలో కేంద్రం
అండగా ఉంటామని నేతల భరోసా
న్యూదిల్లీ : ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకుంటామని అఖిలపక్ష నేతలకు కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. పహల్గాం ఉగ్రదాడిపై గురువారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశం వివరాలను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వెల్లడిరచారు. ‘జమ్మూకశ్మీర్ ఆర్థిక వ్యవస్థ పుంజుకుని, పర్యాటకం వృద్ధి చెందుతున్న సమయంలో స్థానిక పరిస్థితులను ప్రభావితం చేసే లక్ష్యంతోనే పహల్గాం ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటన, తదనంతరం తీసుకున్న చర్యలను రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ అఖిలపక్ష నేతలకు వివరించారు. ఉగ్రదాడికి దారితీసిన లోపాలు, అవి పునరావృతం కాకుండా తీసుకుంటున్న చర్యల గురించి ఇంటెలిజెన్స్ బ్యూరో, కేంద్ర హోంశాఖ అధికారులు వివరించారు. ఉగ్రవాదంపై పోరులో ప్రభుత్వం వెన్నంటే ఉన్నట్లు అన్ని పార్టీల నేతలు చెప్పారు’ అని కిరణ్ రిజిజు తెలిపారు. పార్లమెంట్ సముదాయంలోని భవనంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఈ కీలక భేటీ నిర్వహించారు. సమావేశం ప్రారంభానికి ముందు ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపంగా నేతలందరూ నిలబడి రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు జైశంకర్, నిర్మలా సీతారామన్, కిరణ్ రిజుజు, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖడ్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ సహా ఆయా పార్టీల ముఖ్య నేతలు హాజరయ్యారు.
పహల్గాం ఉగ్రదాడిని అందరం ముక్తకంఠంతో ఖండిరచామని, కేంద్రం తీసుకునే ఏ చర్యకైనా పూర్తి మద్దతు ఇస్తామని హామీ ఇచ్చామని రాహుల్ గాంధీ చెప్పారు. కశ్మీర్లో శాంతియుత పరిస్థితుల కోసం కేంద్రం తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశామని మల్లికార్జున ఖడ్గే తెలిపారు. ఉగ్రవాదంపై పోరాటంలో ప్రభుత్వం వెన్నంటే ఉన్నామని, ప్రధాని మోదీ వీలైనంత త్వరగా అన్ని పార్టీల అధ్యక్షులతో సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేశామని తృణమూల్ నేత సుదీప్ బందోపాధ్యాయ సూచించారు.