నరేగా నిధులను అద్భుతంగా వాడుకున్నారని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా గ్రామాల్లో వైకుంఠధామాలు, డంపింగ్ యార్డుల ఏర్పాటుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. నరేగా నిధులు పద్ధతిగా వాడుకున్నామన్నారు. కేంద్రం విచారణ చేసినా అవినీతి జరగకుండా నిధులు వాడిన ప్రభుత్వం తెలంగాణ అని పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ వహించారని అన్నారు. రాష్ట్రంలో 12,769 గ్రామపంచాయతీలకు గానూ ఇప్పటి వరకు 12,672 వైకుంఠధామాలు, 12,737 డంపింగ్ యార్డులను ఏర్పాటు చేశామన్నారు. మిగిలిన 147 గ్రామాల్లో వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులను ఈ ఏడాది అక్టోబర్ వరకు పూర్తి చేశాం. వైకుంఠధామాల కోసం రూ. వెయ్యి కోట్ల 547 కోట్లు, డంపింగ్ యార్డుల కోసం రూ. 319 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. వైకుంఠధామాలను ఒక టెంపుల్ మాదిరిగా అద్భుతంగా తీర్చిదిద్దాం. మిషన్ భగీరథ నీళ్లను వైకుంఠధామాలకు అందిస్తున్నాం. పల్లె ప్రకృతి వనాలను అందంగా తయారు చేశామని చెప్పారు.