రాబోయే 25 ఏళ్ల దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు వెళుతున్నామన్న ప్రధాని
పీఎం గతిశక్తి కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ నేడు దిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మోదీ విదేశీ పెట్టుబడులను ఆకర్షించడమే ఈ కార్యక్రమ లక్ష్యమని చెప్పారు. రాబోయే 25 ఏళ్ల దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు వెళుతున్నామని ప్రధాని అన్నారు. జాతీయ మాస్టర్ ప్లాన్ విధానంతో 21వ శతాబ్ధపు అభివృద్ధి ప్రణాళికలకు గతిశక్తి లభిస్తుందని తెలిపారు. గతంలో ఎక్కడకు వెళ్లినా వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అన్న బోర్డులు కనిపించేవని, ఆ బోర్డులను చూసి ఈ పనులు ఎన్నడూ ముగియవని ప్రజలు అనుకునేవారని, ప్రజల్లో అపనమ్మకం పెరిగేదని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిందన్నారు. దాదపు 16 మంత్రిత్వశాఖల సమన్వయంతో చేపట్టే ఈ కార్యక్రమం ద్వారా రానున్న రోజుల్లో దేశ మౌలిక వసతుల ముఖచిత్రమే సమూలంగా మారిపోతుందని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తంచేశారు. ఢల్లీిలోని ప్రగతి మైదాన్లో ఎగ్జిబిషన్ కాంప్లెక్స్ కొత్త మోడల్ను కూడా ప్రధాని సమీక్షించారు.
గతిశక్తి ప్రణాళికలో సుమారు 107 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు ఉన్నాయి. జాతీయ రహదారుల్ని బలోపేతం చేసేందుకు సుమారు రెండు లక్షల కిలోమీటర్ల మేర ఇంటిగ్రేటెడ్ నెట్వర్క్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. రైల్వేల ద్వారా 1600 మిలియన్ టన్నుల కార్గోను తరలించనున్నారు. 35వేల కిలోమీటర్ల విస్తీర్ణంలో గ్యాస్ పైప్లైన్ కనెక్టివిటీ పెంచనున్నారు. రానున్న అయిదేళ్లలో కొత్తగా 220 విమానాశ్రయాలను నిర్మించనున్నారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా 25వేల ఎకరాల విస్తీర్ణంలో 11 పారిశ్రామిక వాడలను అభివృద్ధిపరచనున్నారు. సైనిక దళాలను బలోపేతం చేసేందుకు 1.7 లక్షల కోట్ల విలువైన రక్షణ ఉత్పత్తులను తయారు చేయనున్నారు.