. రాజకీయ ఉనికి కోసం కవిత పోరాటం
. ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యం
. ముఖాముఖిలో మంత్రి పొన్నం
విశాలాంధ్ర – హైదరాబాద్: ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ప్రజాభవన్లో విజ్ఞప్తులను స్వీకరిస్తున్న ప్రభుత్వం… ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ సూచనల మేరకు గాంధీభవన్లో కూడా ముఖాముఖి కార్యక్రమం పున:ప్రారంభించినట్టు వివరించారు. ఈ మేరకు బుధవారం మహేశ్కుమార్… మీనాక్షి నటరాజన్ సమక్షంలోనే మంత్రి బాధితుల నుంచి బుధవారం దరఖాస్తులను స్వీకరించారు. పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు తగు అదేశాలు జారీ చేశారు. పొన్నం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి గాంధీ భవన్ దేవాలయం లాంటిదని, కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణమైన దేవాలయంలో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తున్నామని వివరించారు. బీఆర్ఎస్ పార్టీలో గొడవలు టీ కప్పులో తుపాన్ లాంటివని, ఉనికి కోసం బీఆర్ఎస్ డ్రామాలు అడుతుందని మండిపడ్డారు. కేసీఆర్ ప్రజాధనం దుర్వినియోగం చేశారని, కవిత రాజకీయ ఉనికి కోసమే పోరాటం చేస్తుందని, వార్తల కోసమే లేఖలు రాశారని విమర్శించారు. ముఖాముఖి ద్వారా కార్యకర్తలు, ప్రజలు తమ సమస్యలను నేరుగా మంత్రులకు తెలియజేసే అవకాశం కలగనుంది. భూ సమస్యలు, వృద్ధులు, ఉద్యోగావకాశాలు, పార్టీ పదవులు తదితర సమస్యలపై వినతిపత్రాలను స్వీకరించారు.