థాయిలాండ్ ప్రధానికి పదవీ గండం
బ్యాంకాక్: థాయిలాండ్ ప్రధాని పెటోంగటార్న్ షినావత్రాను ఒక ఫోన్ కాల్ చిక్కుల్లో పడేసింది. ఆమె పదవికి గండం ఏర్పడిరది. కంబోడియా మాజీ ప్రధాని హున్ సేన్తో ఆమె ఫోన్ సంభాషణ లీకైంది. దీంతో రాజకీయ దుమారం రేగింది. ఆమె రాజీనామాకు డిమాండ్ వచ్చింది. ఫోన్ కాల్లో తనకు ప్రత్యర్థిగా సంబోధించిన సీనియర్ సైన్యాధికారిని ఆమె శుక్రవారం కలిశారు. అందుకోసం ఆమే ఈశాన్య థాయిలాండ్లోని చోంగ్ బోక్ అనే ప్రాంతానికి వెళ్లారు. సెకెండ్ ఆర్మీ రీజన్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ బూన్సిన్ పడ్క్లాంగ్తో తన సంబంధాలను చక్కబెట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ మేరకు బ్యాంకాక్ పోస్టు వెల్లడిరచింది. 38 ఏళ్ల షినావత్రా ప్రధానిగా బాధ్యతలు చేపట్టి ఏడాది కూడా కాలేదు. ఈలోగా వివాదంలో చిక్కుకోవడంతో ఆమె బహిరంగంగా క్షమాపణ చెప్పుకోవాల్సి వచ్చింది. తమ సంభాషణను హున్ సేన్ ఆన్లైన్లో పెట్టడంతో వివాదం మొదలైంది. వీరిద్దరి మధ్య ఈనెల 15న ఫోన్ సంభాషణ జరిగింది. ఇటీవల థాయిలాండ్, కంబోడియా మధ్య సరిహద్దు ఘర్షణ గురించి ఇద్దరు చర్చించుకున్నారు. హున్ సేన్ను ‘అంకుల్’ అని సంబోధించిన షెనావత్రా… లెఫ్టినెంట్ జనరల్ పడ్క్లాంగ్ను విరోధిగా వ్యవహరించారు. వీరిద్దరి ఫోన్ సంభాషణ లీకైంది. కంబోడియా-థాయ్లాండ్ మధ్య సరిహద్దు వివాదాలతో సంబంధాలు దెబ్బతిన్న తరుణంలో తాజా పరిణామం వివాదాస్పదమైంది. ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి. దేశ పరువు, ఆర్మీ గౌరవం మంటగలిపారంటూ ఆరోపణలు వచ్చాయి. తక్షణమే పదవిలో నుంచి తప్పుకోవాలని డిమాండ్ ఉంది. ఈ క్రమంలోనే షినావత్రా నేతృత్వ సంకీర్ణ ప్రభుత్వం నుంచి కన్జర్వేటివ్ భూమ్జాయ్థాయ్ పార్టీ విడిపోయింది. పార్లమెంట్లో 69 మంది ఎంపీలు ఆమెకు మద్దతు విరమించుకున్నారు. దీంతో మెజార్టీ పడిపోయింది. ఈ పరిస్థితి సంకీర్ణ ప్రభుత్వంలో తిరుగుబాటుకు సంకేతాలిస్తున్నది. అదే జరిగితే ప్రభుత్వం కుప్పకూలుతుంది. ఇది రాజకీయ అనిశ్చితికి దారితీయొచ్చు. మళ్లీ ఎన్నికలు రావచ్చు.
ఫోన్కాల్ తెచ్చిన తిప్పలు
RELATED ARTICLES