Saturday, June 21, 2025
Homeసంపాదకీయంసొంత అజ్ఞానం-సర్వవ్యాప్తం

సొంత అజ్ఞానం-సర్వవ్యాప్తం

‘‘ఇంగ్లీషు మాట్లాడే వారు సిగ్గుపడే రోజు త్వరలోనే వస్తుంది.’’ ఈ మాటలు అన్నది కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా. మాజీ ఐఏఎస్‌ అధికారి అశుతోష్‌ అగ్నిహోత్రి రాసిన ‘‘మై బూంద్‌ స్వయం, ఖుద్‌ సాగర్‌ హూ’’ గ్రంథాన్ని ఆవిష్కరించే సందర్భాన్ని గురువారం అమిత్‌ షా ఇంగ్లీషు మాట్లాడే వారిని తృణీకరించడానికి వినియోగించుకున్నారు. ఇంగ్లీష్‌ మాట్లాడే వారిని అవమానించడం వెనక హిందీని దేశవ్యాప్తంగా విస్తరింప చేయాలన్నది అమిత్‌ షా ఉద్దేశం కావొచ్చు. అమిత్‌ షాకు ఇంగ్లీషు రాకపోవడం ఆయన తప్పు కాదు. చాలా మంది రాజకీయ నాయకులకు ఇంగ్లీషు రాకపోవచ్చు. అది వారి లోపమూ కాదు. కానీ ఒక భాషను ఉన్నత స్థానంలో ఉంచడానికి మరో భాషను కించపరిచే ధోరణి మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ అంగీకరించలేం. బీజేపీ ఎటూ మతాలవారీగా జనాన్ని విడగొట్టడంలో సఫలమైంది. ఇటీవలి కాలంలో భాష ఆధారంగా కూడా జనాన్ని విడదీయాలని చూస్తోంది. హిందీని మొత్తం దేశం మీద రుద్దడానికి బీజేపీ పన్నిన కుట్రలో అమిత్‌ షాది పెద్ద పాత్రే. మన దేశంలో మాట్లాడే ఏ ఒక్క భాషనూ అధికార భాషగా మలుచుకోలేకపోయాం. అది సాధ్యం కానందువల్లే అవసరమైనన్నాళ్లు ఇంగ్లీషు వ్యవహారంలో ఉండాలనుకున్నాం. ప్రాంతీయ భాషలను చిన్న చూపు చూసి జాతీయ భాషను పెంపొందింప చేస్తామనుకోవడం ఎన్నటికీ సాధ్యమయ్యేది కాదు. బహు భాషలు మాట్లాడే దేశాలు ప్రపంచంలో చాలానే ఉన్నాయి. కానీ ఎక్కడా ప్రాంతీయ భాషలను కించపరిచే ప్రయత్నం జరగలేదు. మన దేశంలో ఇంగ్లీషు సమగ్రంగా తెలిసినవారు తక్కువే కావొచ్చు. కానీ 30 నుంచి 40 శాతం మందికి ఎంతో కొంతమేర ఇంగ్లీషుతో పరిచయం ఉంది. తమ పిల్లలను ఇంగ్లీషు మాధ్యమంలో బోధించే పాఠశాలల్లోనే చేర్పించాలనుకునే వారు కేవలం ఉన్నత సామాజిక వర్గాలకు చెందిన లేదా ఆర్థిక వెసులుబాటు ఉన్నవారే కాదు. ఆర్థిక స్తోమత అంతంత మాత్రమైన కుటుంబాలవారు కూడా ఇంగ్లీషు మాధ్యమంలో చదివితేనే తమ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుందనుకునే భావన ఉన్నవారు కూడా ఎక్కువే. ఇంగ్లీషు అంతర్జాతీయ భాష కాకపోవచ్చు. కానీ చాలా దేశాలవారికి ఇంగ్లీషుతో అంతో ఇంతో పరిచయం ఉంది. ఒకప్పుడు ప్రపంచంలోని అత్యధిక దేశాలు బ్రిటిష్‌ పాలనలో మగ్గినందువల్ల ఇంగ్లీషుతో వ్యవహారం అనివార్యం అయింది. మన దేశంలో దాదాపు 1,369 భాషలు ఉన్నాయని ఓ అంచనా. ఇందులో పది వేలకన్నా ఎక్కువ మంది మాట్లాడే భాషలు 121 ఉన్నాయి. భారత రాజ్యాంగం 22 భాషలను అధికారికంగా గుర్తించింది. జనం తమ నిత్య జీవితంలో వినియోగించే అనేక భాషలకు లిపి లేదు కనక ఆ భాషల్లో సాహిత్యం ఉండదు. హిందీని అధికారభాషగా మలిచే ఆత్రుతలో ఇతర భాషలను చిన్న చూపు చేసే ప్రయత్నాలు, ముఖ్యంగా హిందీని అధికారభాషగా మార్చే ప్రయత్నాలు గతంలోనూ జరిగాయి. అలాంటి ప్రయత్నం జరిగినప్పుడల్లా ఎదురు దెబ్బలే తగిలాయి. జాతీయోద్యమ కాలంలో హిందుస్థానీని జాతీయ భాషగా చేయాలనుకున్నారు. కానీ ఆ ప్రయత్నం కాస్తా హిందీకి పెద్ద పీట వేసే పన్నాగాలు జరగడంవల్ల లక్ష్యం నెరవేరనే లేదు. బీహార్‌, చత్తీస్‌గఢ్‌, హర్యానా, హిమాచల్‌ ప్రదేశ్‌, రaార్ఖండ్‌, మధ్య ప్రదేశ్‌, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లో ఎక్కువ మంది హిందీ మాట్లాడతారు. వీటిని హిందీ మాట్లాడే రాష్ట్రాలు లేదా ‘‘హిందీ బెల్ట్‌’’ అంటున్నాం. హిందీ బెల్ట్‌ కిందకు రాష్ట్రాలలో కూడా మొదటి భాషగానో, రెండవ భాషగానో హిందీ మాట్లాడేవారు గణనీయంగానే ఉన్నారు. దిల్లీ, చండీగఢ్‌, గుజరాత్‌, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలలోనూ హిందీ మాట్లాడే వారు గణనీయమైన సంఖ్యలోనే ఉన్నారు. ఉత్తరాది వారు ఏ దక్షిణాది భాషనూ నేర్చుకోవడానికి సిద్ధంగా లేరు కానీ దక్షిణాది రాష్ట్రాలు హిందీ నేర్చుకోవాలని బలవంత పెడ్తుంటారు. ఇది జనం మాట్లాడే భాషను గౌరవించకపోవడమే. ఆధునిక ప్రపంచంలో ఒక్క భాష మాత్రమే వచ్చిన వారికి ఏ భాషా రానట్టేనని భాషా శాస్త్రవేత్తలు అంటారు. ఎక్కువ భాషలు తెలిస్తే ఇతర భాషలు మాట్లాడేవారితో సంభాషించడం సులభం అవుతుంది. అది ఏ భాష అనేది ప్రజలు నిర్ణయించుకుంటారు తప్ప ప్రభుత్వాలు రుద్దవలసిన విషయం కాదు.
ఒక వర్గాన్ని ఆదరించడం కోసం ఇతర వర్గాలను అవమానించడమే బీజేపీ అనుసరించే విధానం. ఈ పద్ధతిలోనే మతాల వారీగా జనాన్ని విభజిస్తున్నారు. ఈ విషయంలో బీజేపీ దృష్టి ప్రధానంగా ముస్లింల మీదే ఉంటుంది. ఆ మతం వారు పరాయివారు అయిపోయారు. ఇప్పుడు ఇంగ్లీష్‌ మీద ద్వేషం పెంచి హిందీని ఉద్ధరించాలని అమిత్‌ షా లాంటి హ్రస్వ దృష్టిగల వారు ప్రయత్నిస్తున్నారు. హిందీని ఉద్ధరించడం కోసం ఇంగ్లీషును అవమానించడం అర్థరహితం. భవిష్యత్తులో ఇంగ్లీషులో మాట్లాడే వారు అవమాన పడాల్సి వస్తుందన్న అమిత్‌ షా మాటలు కేవలం ఇంగ్లీషు మీద ద్వేషంతోనే కాదు. ప్రతిపక్షాల మీద దాడి కూడా ఆ మాటల వెనక దాగుంది. మన దేశం, మన సంస్కృతి, మన చరిత్రను అర్థం చేసుకోవడానికి ఏ విదేశీ భాషా సరిపోదు అని కూడా అమిత్‌ షా అన్నారు. ఆయన చెప్పిన సకల అంశాల మీద లోతైన పరిశోధనలు జర్మన్‌ లేదా ఇంగ్లీషు భాషలోనే ఎక్కువగా జరిగాయి. మన ప్రాచీన సంస్కృతి గొప్ప దనాన్ని చాటి చెప్పడానికి పదకొండేళ్లుగా మోదీ ప్రభుత్వం, అంతకు ముందు ఆరేళ్ల అటల్‌ బీహారి వాజ్‌పేయి ప్రభుత్వం చేసిన కృషి నిమిత్తమాత్రమైందే. అలాంటప్పుడు ఇంగ్లీషును తూలనాడినందువల్ల ఒరిగేదేమీ ఉండదు. విదేశీ భాష ద్వారా సంపూర్ణ భారత్‌ను ఊహించడమూ సాధ్యం కాదు అని అమిత్‌ షా అన్నారు. చర్చ కోసం ఆయన మాట సబబే అనుకుందాం. మరి ఏ భారతీయ భాషలో మన చరిత్రను, సంస్కృతిని, గొప్పతనాన్ని తెలియజెప్పే సమాచారం ఉంది గనక! హిందీలోనూ అలాంటి ప్రయత్నం జరిగిన ఆనవాళ్లు లేవు. సమస్త విజ్ఞానాన్ని భారతీయ భాషల్లో అందుబాటులోకి తేవడాన్ని ఎవరు అడ్డుకున్నారు గనక! చిక్కెక్కడంటే అమిత్‌ షా భారతీయ భాషల గురించి ఆలోచించడం లేదు. హిందీని అన్ని రాష్ట్రాల మీద, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల మీద రుద్దాలని ప్రయత్నిస్తున్నారు. మన యువత విదేశాలకు, ప్రధానంగా అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ లాంటి దేశాల్లో ఉపాధి సంపాదించుకోవడానికి ఇంగ్లీషు తోడ్పడుతోంది. ఈ విషయంలో చైనా, జర్మనీ దేశాలు ఇబ్బందులు పడ్తున్నాయి. భిన్న భాషలు, భిన్న మతాలు, ఇంకా అనేక భిన్నత్వాలే మన దేశ బలం. దాన్నీ అమిత్‌ షా హిందీ సీసాలోకి దింపాలని చూస్తున్నారు. అమిత్‌ షా మాట నమ్మి తమ పిల్లలను హిందీ లేదా మరే ఇతర భారతీయ భాషా మాధ్యమంలోనే చదివిస్తామనుకునే వారు ఎవరైనా ఉన్నారా? లేరు గాక లేరు. ప్రస్తుతానికి విదేశాల్లో ఉపాధి సంపాదించడానికి ఇంగ్లీషే సోపానంగా ఉంది. మనకు లేనిది, రానిది దేశవాసులెవరికి ఉండకూడదని, రాకూడదని వాదించడం కేవలం అమిత్‌ షా లాంటి వితండవాదులకు మాత్రమే అబ్బే విద్య.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు