Homeఆంధ్రప్రదేశ్సీఎం చంద్రబాబు కాన్వాయ్‌లో మార్పులు..

సీఎం చంద్రబాబు కాన్వాయ్‌లో మార్పులు..

- Advertisement -

భద్రతా సిబ్బంది కోసం కీలక నిర్ణయం
సీఎం చంద్రబాబు నాయుడు కాన్వాయ్‌లో మరోసారి మార్పులు జరిగాయి. ఇంధన పొదుపు, భద్రతా అవసరాలను సమన్వయం చేస్తూ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఎం భద్రతా సిబ్బంది సౌకర్యార్థం కాన్వాయ్‌లోకి కొత్తగా రెండు మినీ బస్సులను చేర్చారు. ముఖ్యమంత్రి ఇటీవల కుప్పం పర్యటనకు వెళ్లినప్పుడు ఈ కొత్త వాహనాలు తొలిసారిగా కాన్వాయ్‌లో కనిపించాయి.

ప్రధాని మోదీ పిలుపు మేరకు ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా సీఎం చంద్రబాబు తన కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను 12 నుంచి 4కి తగ్గించిన విషయం తెలిసిందే. అయితే, ముఖ్యమంత్రికి జడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్నందున, ఆయన వెంట నిత్యం 20 మందికి పైగా ఎన్‌ఎస్‌జీ సిబ్బంది, ఇతర భద్రతా సిబ్బంది ఉంటారు. వాహనాల సంఖ్యను గణనీయంగా తగ్గించడంతో భద్రతా సిబ్బంది ప్రయాణానికి ఇబ్బందులు తలెత్తాయి. తక్కువ వాహనాల్లో సర్దుకొని వెళ్లడం కష్టంగా మారడంతో ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

ఈ నేపథ్యంలో భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడకుండా అధికారులు కొత్త పరిష్కారంతో ముందుకొచ్చారు. కార్ల సంఖ్యను పెంచడానికి బదులుగా, భద్రతా సిబ్బంది కోసం ప్రత్యేకంగా రెండు మినీ బస్సులను ఏర్పాటు చేశారు. ఒక్కో బస్సులో 13 మంది చొప్పున మొత్తం 26 మంది సౌకర్యవంతంగా ప్రయాణించేలా ఏర్పాట్లు చేశారు. భద్రతా సిబ్బందితో పాటు మెడికల్ టీమ్ కూడా ఈ బస్సుల్లోనే ప్రయాణిస్తుంది.

ఇకపై ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనలకు వెళ్లినప్పుడు ఈ బస్సులనే వినియోగించనున్నారని అధికారులు చెబుతున్నారు. ఈ నిర్ణయం వల్ల ఇంధన పొదుపు లక్ష్యం కొనసాగుతూనే, ముఖ్యమంత్రి భద్రతకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకున్నట్లయింది. ఏపీలో సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా తమ కాన్వాయ్‌లలో వాహనాలను తగ్గించుకుంటూ ఇంధన పొదుపు చర్యలు పాటిస్తున్న తరుణంలో భద్రతా అవసరాలకు అనుగుణంగా చేసిన ఈ మార్పు ప్రాధాన్యత సంతరించుకుంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు