దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 77వ జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో వైసీపీ శ్రేణులు, కాంగ్రెస్ నాయకులు ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. వైఎస్సార్ జయంతిని పురస్కరించుకుని వైసీపీ అధినేత జగన్ కడప జిల్లా ఇడుపులపాయకు చేరుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్సార్ ఘాట్ను సందర్శించి, అక్కడ జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం తన తండ్రి సమాధి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతితో పాటు వైసీపీకి చెందిన ముఖ్య నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై అంజలి ఘటించారు.
వైఎస్సార్ జయంతి సందర్భంగా రాష్ట్రంలోని వైసీపీ నేతలు, కార్యకర్తలు వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పలు చోట్ల రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు, ఉచిత వైద్య శిబిరాలు, మొక్కలు నాటే కార్యక్రమాలను నిర్వహించారు.


