ఈ తెల్లవారుజామున 5.36 గంటల ప్రాంతంలో ప్రకంపనలు
ఢిల్లీలో భూమికి 5 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం గుర్తింపు
ఘజియాబాద్లో ఊగిపోయిన భవనం
ఈ తెల్లవారుజామున ఢిల్లీ వాసులను భూకంపం భయపెట్టింది. ఉదయం 5.36 గంటలకు రాజధాని, దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 4.0గా నమోదైంది. ఢిల్లీలోనే భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూమికి 5 కిలోమీటర్ల లోతున భూంకంపం సంభవించినట్టు జాతీయ భూంకంప కేంద్రం తెలిపింది. ఢిల్లీలో ఇప్పుడే భూకంపం సంభవించిందని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అతిశీ తెలిపారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని, అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. కాగా, భూంకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం లేదు. భూ ప్రకంపనల కారణంగా ఢిల్లీ రైల్వే స్టేషన్లో అన్నీ ఊగిపోయాయని, ప్రయాణికులు భయంతో పరుగులు పెట్టారని రైల్వే స్టేషన్ వ్యాపారి ఒకరు తెలిపారు. రైలు భూమి కింది నుంచి వెళ్తున్నట్టు అనిపించిందని స్టేషన్లోని ప్రయాణికులు పేర్కొన్నారు. ఇక, ఘజియాబాద్లోనూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భవనం మొత్తం ఊగినట్టు ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. గతంలో ఎప్పుడూ ఇలా చూడలేదని ఆయన పేర్కొన్నారు.