గ్రామ వలంటీర్ల అరెస్టుతో ఉద్రిక్తత
ఇంఫాల్ : రాష్ట్రపతి పాలన విధించిన తర్వాత కూడా మణిపూర్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. కాక్చింగ్ జిల్లాలో గ్రామ వలంటీర్లను అరెస్టు చేయడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేయడంతో శుక్రవారం ఇంఫాల్ లోయ అంతటా నిరసనలు చెలరేగాయని అధికారులు తెలిపారు. జిల్లాలోని పంజావో పల్లుమ్డాలో తెల్లవారుజామున జరిగిన ఆపరేషన్లో భద్రతా సిబ్బంది 10 మందికి పైగా గ్రామ వాలంటీర్లను అరెస్టు చేసి, తరువాత తౌబాల్ జిల్లాలోని ఫుండ్రీ వద్ద ఉన్న భద్రతా దళాల శిబిరానికి తీసుకెళ్లారని అధికారులు వివరించారు. గవర్నర్ అజయ్ కుమార్ భల్లా… జాతి ఘర్షణలతో అట్టుడుకుతున్న రాష్ట్ర ప్రజలను ఏడు రోజుల్లోగా దోచుకున్న, చట్టవిరుద్ధంగా కలిగి ఉన్న ఆయుధాలను స్వచ్ఛందంగా అప్పగించాలని కోరిన ఒక రోజు తర్వాత ఈ అరెస్టులు జరిగాయి. గడువు ముగిసిన తర్వాత ‘కఠిన చర్యలు’ తీసుకుంటామని గవర్నర్ నొక్కి చెప్పారు. అధికారుల ప్రకారం, ఇంఫాల్ తూర్పు, ఇంఫాల్ పశ్చిమ, తౌబాల్, కాక్చింగ్ జిల్లాల్లో నిరసనలు జరిగాయి. ఇంఫాల్లోని వాంగై, ఉరిపోక్, థాంగ్మైబంద్, ఖురై ప్రాంతాలలో రోడ్డు పక్కన ఉన్న దుకాణాలు, మార్కెట్లను కూడా వారు బలవంతంగా మూసివేయించారు. కేవలం ఒక వారంలోనే భద్రతా దళాలు వివిధ సంస్థలకు చెందిన సీనియర్ నాయకుడు సహా 30 మందికి పైగా తిరుగుబాటుదారులను అరెస్టు చేశారు. కాంగ్లీపాక్ కమ్యూనిస్ట్ పార్టీ (కేసీపీ), పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ), పీఆర్ఈపీఏకే, కేవైకేఎల్, అలాగే కుకి నేషనల్ ఆర్మీ (కేఎన్ఏ), యునైటెడ్ నేషనల్ కుకి ఆర్మీ (యూఎన్కేఏ) వంటి కుకి తీవ్రవాద గ్రూపులతో సహా లోయకు చెందిన వివిధ తిరుగుబాటు గ్రూపులకు చెందిన వారు అరెస్టయిన వారిలో ఉన్నారు. మణిపూర్లోని వివిధ జిల్లాల్లో జరిగిన కార్యకలాపాల సమయంలో భద్రతా దళాలు కనీసం 15 మందుపాతరలు, హెచ్కే తుపాకులు, ఇన్సాస్ తుపాకులు, ఏకే-సిరీస్ తుపాకులు వంటి అధునాతన ఆటోమేటిక్ ఆయుధాలతో సహా గణనీయమైన ఆయుధాలు, పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నాయి.