Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

మానవాళి ఆకలిని అంతం చేయలేమా..?

సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో(యస్‌డిజి) భాగంగా 2030 నాటికి ప్రపంచంలో ఆకలి చావులు, పోషకాహార లోపం లేకుండా చూస్తూ, ‘జీరో హంగర్‌’ సాధించాలనే ఉన్నత, ఉత్తమ నిర్ణయం ఐరాస ఆధ్వర్యంలో వివిధ శాఖలు తీసుకున్నాయి. ఐక్యరాజ్యసమితి శాఖలైన ప్రపంచ ఆహార సంస్థ (యఫ్‌ఏఓ), యునిసెఫ్‌, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ), ఇంటర్నేషనల్‌ ఫండ్‌ ఫర్‌ అగ్రికల్చరల్‌ డెవలప్‌మెంట్‌ (ఐయఫ్‌ఏడి), వరల్డ్‌ ఫుడ్‌ ప్రోగ్రామ్‌ (డబ్ల్యూయఫ్‌పి)లు సంయుక్తంగానిర్వహించిన అధ్యయనాల ఆధారంగా ‘ది స్టేట్‌ ఆఫ్‌ ఫుడ్‌ సెక్యూరిటీ అండ్‌ న్యూట్రీషన్‌ ఇన్‌ ది వరల్డ్‌-2021, యస్‌ఓయఫ్‌ఏ)’ నివేదికను ఇటీవలే విడుదల చేశారు. కోవిడ్‌-19 విపత్తుతో ప్రపంచంలో పేదల ఆకలి, పోషకాహారలోపం 1.5 శాతం పెరిగి 9.9 శాతానికి చేరిందని నివేదిక స్పష్టం చేసింది. 2020లో 720-811 మిలియన్ల ప్రపంచ జనాభా ఆకలి బారిన పడ్డారని తెలుస్తున్నది. 2019 గణాంకాలతో పోల్చితే 2020లో 118 మిలియన్ల పేదలు ఆకలి అంచున అదనంగా నిలిచారని వివరించింది. ప్రపంచంలో పోషకాహారలోపం అత్యధికంగా ఆసియా దేశాల్లో 418 మిలియన్లు ఉండగా, ఆఫ్రికాలో 282 మిలియన్లు ఉన్నారని తెలుస్తున్నది. ప్రత్యేక చర్యలు అమలు పరచని యెడల 2030 నాటికి 660 మిలియన్ల పేదలు ఉంటారని, ఆకలిని అంతం చేయడం అసాధ్యమని తెలుస్తున్నది. కరోనా మహమ్మారి విజృంభణతో అదనంగా 30 మిలియన్ల పేదలు ఆకలితో సతమతం అవుతున్నారని అర్థం అవుతున్నది.
ప్రపంచవ్యాప్తంగా 2020లో 237 కోట్ల (ప్రతి ముగ్గురిలో ఒకరు) ప్రజలకు అవసరమైనంత ఆహారం లభించడం లేదని నివేదిక తెలుపు తున్నది. 2020లో 12 శాతం (92.8 కోట్లు) జనం ఆహార అభద్రత అనుభవిస్తున్నారని, 2019 నాటి కంటే ఎక్కువగా 14.8 కోట్ల పేదలు పెరిగారని తెలుస్తున్నది. లింగ వివక్ష కారణంగా పురుషుల కన్న మహిళల్లో 10 శాతం అధికంగా ఆహార అభద్రత అనుభవిస్తున్నారు. ఆహార ధాన్యాల అధిక ధరలు, ఆదాయం తగ్గడం వల్ల 300 కోట్ల పేదలు పోషకాహారానికి దూరం అవుతున్నారు. పోషకాహారలోపం ప్రపంచ మానవాళికి శాపంగా వెంటాడుతున్నది. 2020లో కోవిడ్‌-19 నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా 22 శాతం (150 కోట్లు) ఐదేళ్ల లోపు పిల్లలు శరీర వృద్ధి నిలిచిపోవడం, 5.7శాతం (3.89 కోట్లు) అధికబరువు సమస్యలతో బాధ పడుతున్నారు. ఆసియా, ఆఫ్రికా దేశాల్లో పిల్లల పోషకాహారలోపం అత్యధికంగా కనిపిస్తున్నది. ఆసియా, ఆఫ్రికా ప్రాంతాల్లో 15-49 ఏళ్ల మహిళల్లో 30 శాతం రక్తహీనత సమస్య కనిపించగా, అమెరికా, యూరప్‌లో 14.6 శాతం మాత్రమే నమోదు అయ్యింది. అనేక సమస్యల మధ్య 2030 నాటికి ఆకలిని అంతం చేయడం అసాధ్యమని వివరించారు.
ఆహార అభద్రత, పోషకాహారలోపం పెరగడానికి కారణాలుగా వాతావరణంలో అసాధారణ ప్రతికూల మార్పులు, ఆర్థిక మందగమనం, ఆర్థిక అసమానతలు, లాక్‌డౌన్‌/కర్ఫ్యూలు లాంటి అంశాలను పేర్కొన్నారు. ఆహార ధాన్యాల దిగుబడి తగ్గడం, మార్కెటింగ్‌ శృంఖలంలో లొసుగులు (ఉత్పత్తి, పంట కోత, ప్రాసెసింగ్‌, రవాణ, మార్కెటింగ్‌, సరైన ధర లేమి), ఆదాయాలు తగ్గడంతో పోషకాహారానికి పేదలు దూరం అవుతున్నారు. మానవీయతను పోషిస్తూ శాంతి స్థాపనలు, వాతావరణ ఒడుదుడుకులను తట్టుకోగల ఆహార వ్యవస్థలు, ఆర్థిక కష్టాలను అధిగమించడం, ఆహార సరఫరా శృంఖలంలో నాణ్యతను పరిరక్షించడం, పేదరికంతో పాటు అసమానతలను తొలగించడం, పోషకాహారం పట్ల ఆరోగ్య అవగాహన కల్పించడం లాంటి చర్యల ద్వారా ఆహార లభ్యత పెరుగుతుంది. ఆర్థిక అసమానతలు పెరిగితే ప్రకృతి సహజ వనరులైన సారవంతమైన నేలలు, మత్స్యసంపద, అటవీ సంపద, నీటి వనరుల కోసం సంఘర్షణలు కలగడం సర్వసాధారణం. సమాజంలో ఆదాయం, ఉత్పత్తి సామర్థ్యం, ఆస్తులు, టెక్నాలజీ, విద్య, ఆరోగ్య రంగాల్లో అసమానతలు పెరిగితే వాటి దుష్ప్రభావానికి అధికంగా మహిళలు, పిల్లలు గురవుతారు. ఆహార ధాన్యాల ఉత్పత్తి నుంచి వినియోగం వరకు ఇమిడి ఉన్న దశల్లో ఆహారం వ్యర్థం కావడం నేర సమానం. ఆహారాన్ని ఆదా చేస్తే ఆహారం ఉత్పత్తి చేసిన దాని కన్న మిన్న. ‘యుయన్‌ ఫుడ్‌ సిస్టమ్స్‌ సమిట్‌-2021‘ సూచనల ప్రకారం ప్రపంచ దేశాలు తమదైన చర్యలను తీసుకుంటూ 2030 నాటికి ‘జీరో హంగర్‌’ దిశగా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించాలి.
`డా. బుర్ర మధుసూదన్‌ రెడ్డి, 9949700037

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img