వైఎస్సార్సీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఏపీ సిట్ పోలీసులు షాక్ ఇచ్చారు. అతనిపై మరో రెండు కేసులు నమోదు చేశారు. మల్లవల్లి పారిశ్రామికవాడలో రైతులకు ప్రభుత్వం అందించిన పరిహారం అందించకుండా 128 మంది రైతులను మోసం చేయడంపై కేసు నమోదు చేశారు. అలాగే తెలప్రోలుకు చెందిన శ్రీధర్ రెడ్డి వివాదం సెట్టిల్మెంట్లో పొలం రిజిస్ట్రేషన్ చేయిస్తానంటు భూమిని కబ్జా చేసినందుకు వంశీ ఆయన అనుచరులుపై మరో కేసు నమోదు అయింది. సీట్ ఏర్పాటు తరువాత నిన్న ఒక్క రోజే గన్నవరం నియోజకవర్గంలో వంశీ ఆయన అనుచరులుపై మొత్తం మూడు కేసులు నమోదు నమోదయ్యాయి. వంశీపై నమోదైన కేసుల అన్ని సీట్కు ఇవ్వాలని పోలీస్ ఉన్నతాధికారులు నిర్ణయించారు.
పోలీసుల విచారణలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ తెలీదు, గుర్తులేదు, మరచిపోయా అని జవాబులు ఇచ్చినట్టు సమాచారం. గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్న ముదునూరి సత్యవర్దన్ను బెదిరించి, కిడ్నాప్ చేసిన కేసులో ప్రధాన నిందితుడు వల్లభనేని వంశీమోహన్, ఏడో నిందితుడు వెలినేని వెంకట శివరామకృష్ణప్రసాద్, ఎనిమిదో నిందితుడు నిమ్మ లక్ష్మీపతిని విజయవాడ జిల్లా జైలు నుంచి పోలీసులు మంగళవారం ఉదయం కస్టడీకి తీసుకున్నారు. ముందుగా ముగ్గురు నిందితులకు వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం అక్కడి నుంచి కృష్ణలంక పోలీస్ స్టేషన్కు తరలించి విచారించారు. ముగ్గురు నిందితులను విచారించడానికి ముగ్గురు ఏసీపీలు రంగంలోకి దిగారు. వల్లభనేని వంశీని సెంట్రల్ జోన్ ఏసీపీ దామోదర్ విచారించారు. శివరామకృష్ణప్రసాద్ను ట్రాఫిక్ ఏసీపీ వంశీధర్గౌడ్, లక్ష్మీపతిని సీసీఎస్ ఏసీపీ వెంకటేశ్వరరావు ప్రశ్నించారు. ఒక్కొక్క అధికారి ఒక్కొక్క నిందితుడికి సుమారు 30 ప్రశ్నలు సంధించారు. రెండు గంటల పాటు వారిని విచారించారు. కాగా.. విచారణాధికారి అడిగిన ప్రశ్నలకు కొన్నింటికి మాత్రమే వంశీ సమాధానాలు చెప్పారు. చాలా వాటికి అబద్ధాలు చెప్పారని విచారణాధికారులు భావిస్తున్నా రు. సత్యవర్దన్ తనకు తెలియదని ముందుగా సమాధానమిచ్చారు.
కస్టడీని రద్దు చేయండి: కోర్టులో మెమో
మరోవైపు వంశీ మూడు రోజుల కస్టడీని రద్దు చేయాలని కోరుతూ కోర్టులో మంగళవారం మెమో దాఖలైంది. నిందితుల తరఫు న్యాయవాది తానికొండ చిరంజీవి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల విచారణ న్యాయస్థానంలో ఆ మెమో దాఖలు చేశారు. కోర్టు ఆదేశాల ప్రకారం నిందితులను విచారించే ప్రదేశం ముందుగా వారి తరఫున న్యాయవాదులకు తెలియజేయాలని, విచారణ సమయంలో మూడు నుంచి నాలుగుసార్లు నిందితులతో న్యాయవాదులు మాట్లాడుకునే అవకాశం ఉంటుందని వివరించారు. ఈ విషయాలను దర్యాప్తు అధికారులు తమకు తెలియజేయలేదని, అందువల్ల పోలీసు కస్టడీని రద్దు చేయాలని కోరారు.
భోజనం వద్దు.. నీళ్లు చాలు
కాగా పోలీసుల విచారణ సమయంలో ఆహారం ముట్టుకోవడానికి వంశీ ఇష్టపడలేదని తెలిసింది. వంశీని విచారిస్తున్న ఏసీపీ దామోదర్ మధ్యాహ్న సమయంలో భోజనం చేయమని అడిగారు. తాను భోజనం చేయనని వంశీ సమాధానం ఇచ్చారు. ఏసీపీ రెండు, మూడుసార్లు అడిగినా ఆయన ఇదే సమాధానం చెప్పారు. ఉదయం నుంచి సాయం త్రం వరకు పలుమార్లు కాఫీ, టీ తాగుతారా.. అని అడిగినా వద్దని జవాబిచ్చారు. తాగడానికి నీళ్లు మాత్రం ఇవ్వమని కోరారు. మిగిలిన ఇద్దరు నిందితులు భోజనాలు చేశారు. జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్న పోలీసులు వంశీని గేటు బయటకు తీసుకురాగానే అక్కడే ఉన్న సిబ్బందికి ఆయన గుడ్మార్నింగ్ చెప్పారు.