49 మంది ఉద్యోగులకు టీటీడీ షోకాజ్ నోటీసులు
తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పరిధిలో పనిచేసే కొంతమంది ఉద్యోగులు తమ సొంత స్థలాలలో ఇళ్లు నిర్మిస్తున్నట్లు నకిలీ పత్రాలను సృష్టించి అక్రమంగా రూ.కోట్లలో రుణాలు పొందినట్లు ఆడిట్ లో బైటపడిరది. సోమవారం వెలుగుచూసిన ఈ వ్యవహారంలో టీటీడీలో అటెండర్ స్థాయి నుంచి డిప్యూటీ ఈవో స్థాయి వరకు ఈ అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు. దీనిపై స్పందించిన టీటీడీ ఈవో జవహర్ రెడ్డి 49 మంది ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న ఉద్యోగులు ఇచ్చే వివరణ పై తదుపరి చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ నిభందనల మేరకు టీటీడీలో ఉద్యోగి క్యాడర్ మేరకు హౌస్ బిల్డింగ్ లోన్ ఇస్తారు. వేతనం ఆధారంగా అటెండర్ స్థాయి ఉద్యోగికి రూ.10 లక్షలు సీనియర్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగికి రూ.12.5 లక్షలు సూపరిండెంట్ కి రూ.15 లక్షలు, ఏఇఓ ఆపై స్థాయి అధికారికి రూ.20 లక్షల వరకు రుణం ఇస్తారు. అయితే బిల్డింగ్ కట్టకుండానే తప్పుడు పత్రాలు చూపించి లోన్ తీసుకున్న ఘటనలు వెలుగు చూడడంతో ఐదు సంవత్సరాల క్రితమే విజిలెన్స్ ఎంక్వయిరీకి అప్పటి ఈవో సాంబశివరావు ఆదేశించారు. రెండు సంవత్సరాల క్రితం విజిలెన్స్ నివేదిక సమర్పించినప్పటికి చర్యలు మాత్రం వాయిదా పడుతూనే వచ్చాయి. ఇటివల వరుసగా అక్రమాలకు పాల్పడుతున్న టిటిడి ఉద్యోగులు పై తీవ్రస్థాయిలో చర్యలు తీసుకుంటున్న ఇఓ జవహర్ రెడ్డి గత ఆరు నెలల కాలంలో 23మంది ఉద్యోగులను సర్వీసు నుంచి డిస్మిస్ చేశారు. మరి కొంత మంది పై క్రమశిక్షణ చర్యలతో సరిపెట్టిన ఈఓ తాజాగా ఈ వ్యవహారంపై దృష్టి సారించారు.