అమెరికాలోని క్యాపిటల్ హిల్ దాడి ఘటన (2021) సమయంలో అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రసంగాన్ని తప్పుగా ఎడిట్ చేసినందుకు ప్రపంచ ప్రసిద్ధ మీడియా సంస్థ బీబీసీ పెద్ద ఇబ్బందుల్లో పడింది.ట్రంప్ వ్యాఖ్యలను తారుమారు చేసి, తప్పుడు అర్థం వచ్చేలా మార్చినందుకు బీబీసీపై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తాయి.ఈ వ్యవహారంపై బాధ్యత వహిస్తూ బీబీసీకి చెందిన పలువురు ఉన్నతాధికారులు ఇప్పటికే రాజీనామా చేశారు. ఇదిలా ఉండగా, తన ప్రసంగాన్ని తప్పుడు రీతిలో చూపించి పరువునష్టం కలిగించినందుకు, బీబీసీపై ఒక బిలియన్ డాలర్ల పరిహారం కోరుతూ అధ్యక్షుడు ట్రంప్ లాయర్ అలెజాండ్రో బ్రిటో లేఖ రాశారు.సవరణ చేసిన డాక్యుమెంటరీని పూర్తిగా ఉపసంహరించుకోవాలని ఆయన బీబీసీకి డిమాండ్ చేశారు.
ఈ వార్తలు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యాయని, తప్పుడు ప్రచారం ద్వారా ట్రంప్ ప్రతిష్ఠను దెబ్బతీసినందుకు భారీ పరిహారం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు.అదే సమయంలో పరిహారం చెల్లించడానికి శుక్రవారం వరకు గడువు ఇస్తున్నట్లు పేర్కొన్నారు.ఈ లేఖపై స్పందించిన బీబీసీ ప్రతినిధులు, ట్రంప్ న్యాయ బృందం పంపిన లేఖను సమీక్షిస్తున్నామని తెలిపారు.తమ పొరపాటును అంగీకరించి, అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలను తప్పుగా చూపినందుకు ఇప్పటికే బహిరంగ క్షమాపణలు ప్రకటించినట్లు గుర్తుచేశారు.
2021 జనవరి 6న వాషింగ్టన్లోని క్యాపిటల్ హిల్పై ట్రంప్ మద్దతుదారులు దాడులు చేసిన సమయంలో, ట్రంప్ సుమారు గంటపాటు ప్రసంగించారు.బీబీసీ రూపొందించిన పనోరమా డాక్యుమెంటరీలో ఆ ప్రసంగాన్ని తప్పుగా ఎడిట్ చేసి ప్రసారం చేసింది.అసలు వీడియోలో ట్రంప్ శాంతియుతంగా ఆందోళన చేయండి, మనం బలంగా పోరాడాలని పేర్కొన్నా, ఎడిట్ చేసిన వెర్షన్లో మనమంతా క్యాపిటల్ హిల్కు వెళ్తున్నాం… పోరాడదామని మాత్రమే ఉంచడంతో సందర్భం పూర్తిగా మారిపోయింది.దీని ఫలితంగా తీవ్ర విమర్శలు, రాజకీయ ఒత్తిడులు ఉద్భవించాయి. ఈ వివాదం చెలరేగడంతో, ప్రభుత్వ నిధులతో నడిచే బీబీసీకి చెందిన డైరెక్టర్ జనరల్ టిమ్ డేవీ, న్యూస్ చీఫ్ టర్నెస్ డెబోరాలు రాజీనామా చేయాల్సి వచ్చింది.


