ప్రముఖ టెక్నాలజీ సంస్థ మైక్రోసాఫ్ట్ మరోసారి ఉద్యోగాల కోతకు సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3 శాతం మంది ఉద్యోగులను తగ్గించిన కొన్ని వారాల్లోనే, ఇప్పుడు మరికొంత మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సంస్థాగత పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది.
వాషింగ్టన్ స్టేట్ ఎంప్లాయ్మెంట్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్కు మైక్రోసాఫ్ట్ సమర్పించిన ఫైలింగ్ ప్రకారం… వాషింగ్టన్ రాష్ట్రంలోని రెడ్మండ్ కార్యాలయంలో అదనంగా 305 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించారు. గత నెలలో ప్రకటించిన 6,000 ఉద్యోగాల కోతకు ఇది అదనమని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఁమారుతున్న మార్కెట్లో కంపెనీ విజయం సాధించడానికి అవసరమైన సంస్థాగత మార్పులను కొనసాగిస్తున్నాముఁ అని ఆయన పేర్కొన్నారు.
ఈ తొలగింపులపై మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల స్పందిస్తూ, ఇవి ఉద్యోగుల పనితీరుకు సంబంధించినవి కావని, సంస్థాగత పునర్వ్యవస్థీకరణలో భాగమేనని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై కంపెనీ ఎక్కువగా దృష్టి సారిస్తున్న నేపథ్యంలో, మారుతున్న ప్రాధాన్యతలకు అనుగుణంగా బృందాలను పునరేకీకరించడం అవసరమని ఆయన టౌన్హాల్ సమావేశంలో ఉద్యోగులకు వివరించారు. ఈ నిర్ణయం వల్ల కలిగే భావోద్వేగ ప్రభావాన్ని గుర్తించినప్పటికీ, ఇవి వ్యూహాత్మక మార్పుల వల్లే తప్ప, ఉత్పాదకత లేదా ప్రతిభలో లోపాల వల్ల కాదని నొక్కి చెప్పారు.
గత నెలలో జరిగిన మైక్రోసాఫ్ట్ బిల్డ్ 2025 కార్యక్రమంలో కంపెనీ చీఫ్ కమ్యూనికేషన్స్ ఆఫీసర్ ఫ్రాంక్ ఎక్స్ షా మాట్లాడుతూ, ఁమనం ఏఐ ఏజెంట్ల యుగంలోకి ప్రవేశించాంఁ అని అన్నారు. రీజనింగ్ మరియు మెమొరీలో అద్భుతమైన పురోగతి కారణంగా ఏఐ నమూనాలు ఇప్పుడు మరింత సమర్థవంతంగా మారాయని, గిట్హబ్ కోపైలట్ను ఇప్పటికే 15 మిలియన్ల డెవలపర్లు ఉపయోగిస్తున్నారని ఆయన తెలిపారు. అలాగే, లక్షలాది మంది కస్టమర్లు మైక్రోసాఫ్ట్ 365 కోపైలట్ను వాడుతున్నారని, 2,30,000కు పైగా సంస్థలు కోపైలట్ స్టూడియోతో ఏఐ ఏజెంట్లను రూపొందించుకున్నాయని ఆయన వివరించారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే కంపెనీ తన కార్యకలాపాలను పునర్వ్యవస్థీకరిస్తున్నట్లు తెలుస్తోంది.