రాష్ట్రాలలో ఉన్న పాకిస్థానీయులను గుర్తించి వారిని స్వదేశానిని పంపివేయాలని దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కోరారు. పహల్గాంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడి ఘటన అనంతరం దేశంలో ఉన్న పాకిస్థాన్ జాతీయులకు సంబంధించిన వీసాలను రద్దు చేయాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.. ఈ నెల 27లోగా అందరూ తమ తమ దేశానికి వెళ్లిపోవాలని ఇప్పటికే ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఫోన్ లో మాట్లాడారు. తమ రాష్ట్రాల్లో ఉన్న పాక్ పౌరులను గుర్తించి, వారిని వెనక్కి పంపేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. పాకిస్థాన్కు చెందిన వారిని త్వరగా వెనక్కి పంపేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. భారత్లో ఉన్న పాకిస్థాన్ పౌరుల వీసాలను రద్దు చేసే ప్రక్రియను చేపట్టాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర హోంమంత్రి సూచించినట్లు సమాచారం. ఈ నెల 27వ తేదీ నాటికి అన్ని వీసాలు రద్దవుతాయని కేంద్రం తెలిపింది. ఇటీవల చోటుచేసుకున్న ఉగ్రవాద దాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.