అమెరికా అధ్యక్ష పీఠాన్నిఅధిష్ఠించినప్పటి నుంచి సంచలన నిర్ణయాలు, ప్రకటనలతో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న డొనాల్డ్ ట్రంప్ తాజాగా చేసిన ప్రకటన మరోమారు దుమారం రేపింది. ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో నలిగిపోయిన గాజాను స్వాధీనం చేసుకోవాలని భావిస్తున్నట్టు ట్రంప్ చెప్పారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో భేటీ అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు.
గాజాను స్వాధీనం చేసుకున్న తర్వాత అక్కడ ధ్వంసమైన భవనాలను పునర్నిర్మిస్తామని ట్రంప్ తెలిపారు. ఆ ప్రాంతాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేస్తే అక్కడి ప్రజలకు అపరిమితమైన ఉద్యోగాలు కల్పించవచ్చని పేర్కొన్నారు. ట్రంప్ ప్రకటనపై నెతన్యాహు స్పందించారు. ఈ నిర్ణయం చరిత్రను మారుస్తుందని కొనియాడారు.
కాగా, యుద్ధం కారణంగా గాజాలో నిరాశ్రయులుగా మారిన పాలస్తీనా ప్రజలకు అరబ్ దేశాలు ఆశ్రయం కల్పించాలన్న ట్రంప్ ప్రతిపాదనను ఆయా దేశాలు ఖండించాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. గాజాను తామే స్వాధీనం చేసుకుని అభివృద్ధి చేస్తామని తెలిపారు. అయితే, ట్రంప్ ప్రకటనను హమాస్ ఖండించింది. ఈ ప్రాంతంలో గందరగోళం, ఉద్రిక్తతలు పెంచేందుకే ట్రంప్ ఈ ప్రకటన చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ దురాక్రమణను అడ్డుకుంటామని తెలిపింది.