ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేలా, సమర్థవంతంగా సేవలందించేందుకు నేను నిరంతరం కృషి చేస్తాను…మంత్రి సత్య కుమార్ యాదవ్.
విశాలాంధ్ర తాడిమర్రి/ధర్మవరం; ధర్మవరం నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చేతుల మీదుగా రెండు ప్రధాన అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ధర్మవరం నియోజకవర్గం తాడిమర్రి మండల కేంద్రంలో బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్, తహసీల్దార్ కార్యాలయం నూతన భవనాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మండల స్థాయిలో ప్రాథమిక ఆరోగ్య సేవలను మెరుగుపరచడం ద్వారా గ్రామీణ ప్రజలకు సమర్థవంతమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 168 బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్లు మంజూరయ్యాయి అని, ఇందులో భాగంగా ధర్మవరం నియోజకవర్గానికి ప్రత్యేకంగా రెండు యూనిట్లను కేటాయించడం ప్రభుత్వ బాధ్యతాయుతమైన దృక్పథానికి నిదర్శనమన్నారు. అలాగే, ప్రజలకు రెవెన్యూ సేవలు సులభంగా, వేగంగా అందించేందుకు రూ.10 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన తహసీల్దార్ కార్యాలయం ప్రారంభించబడింది అని తెలిపారు. ఈ కార్యాలయం ద్వారా ప్రజల ఫిర్యాదులకు వేగవంతమైన పరిష్కారం లభిస్తుందని, రెవెన్యూలో పారదర్శకత మరింత పెరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి గత వైసీపీ పాలనను విమర్శిస్తూ వైసిపి ప్రభుత్వం ఆరోగ్య రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని వారు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,600 మందికి పైగా వైద్య సిబ్బందిని నియమించడం జరిగిందని, త్వరలో మరో ఎనిమిది వేలు పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కానున్నదని వారు తెలిపారు. తదుపరి రాష్ట్రంలోని వైద్య సంస్థల్లో ఉపయోగించే డయోగ్నస్టిక్ సామాగ్రిలో 3200 ఐటమ్స్, అందులో ఆరు సిటీ స్కానర్లు కూడా ప్రభుత్వం కొనుగోలు చేసిందని తెలిపారు. కర్నూలులో 24 కోట్ల వ్యయంతో లీ నాక్స్ పరికరం సహాయంతో స్టేట్ క్యాన్సర్ సెంటర్లు ప్రారంభించడం ద్వారా క్యాన్సర్ చికిత్సలు ప్రజలకు ఉచితంగా అందిస్తున్నామని వారు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా విలేజ్ హెల్త్ ఇన్స్ట్రక్చర్ అభివృద్ధికి 3,336 భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు కావడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమాలు ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో సాగుతున్నాయని తెలిపారు. తదుపరి తాడిమర్రి మండల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కూడా వారు వివరించారు. తాడిమర్రి బాలుర వసతి గృహ మరమ్మత్తులకు 14 లక్షలు నిధులు, వేసవి ప్రణాళికలో భాగంగా మండలంలో 10 కొత్త బోర్లు వేశామని, మూడు కోట్ల వ్యయంతో 87 సీసీ రోడ్ల నిర్మాణ పనులు కూడా చేపట్టడం జరిగిందని, 9.5 కోట్లు చిత్రావతి జలాశయం ముంపు బాధితులకు చెల్లింపు చేయడం జరిగిందని తెలిపారు. అలాగే శివంపల్లి దినదరి గ్రామాలలో ఆరు ప్లాంట్ లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ధర్మవరం నియోజకవర్గం నా కుటుంబం లాంటిదని వారు స్పష్టం చేశారు. ప్రజల ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేలా సమర్థవంతంగా సేవలు అందించేందుకు నేను సర్వదా మీకు సేవలు అందిస్తానని తెలిపారు. నియోజకవర్గ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా పనిచేయడమే నా ధ్యేయమని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, డి ఎం ఎల్ హెచ్ ఓ.. ఫై రోజు బేగం, ఆర్డీవో మహేష్, తాసిల్దార్ భాస్కర్ రెడ్డి, ఎంపీడీవో రంగారావు, సల్మాన్, డాక్టర్లు హరిత, గోవర్ధన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
బ్లాక్ హెల్త్ యూనిట్, తహసీల్దార్ కార్యాలయం ప్రారంభం
RELATED ARTICLES