ఆసియాలో మళ్లీ కోవిడ్ అలజడి.. పలు దేశాల్లో పెరుగుతున్న కేసులు
ఆసియాలోని పలు దేశాల్లో కరోనా వైరస్ మరోసారి పంజా విసురుతోంది. ముఖ్యంగా అధిక జనసాంద్రత కలిగిన హాంకాంగ్, సింగపూర్ నగరాల్లో కోవిడ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయని అక్కడి ఆరోగ్య అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ పరిణామం ఆసియా వ్యాప్తంగా ఆందోళనలకు దారితీస్తోంది.హాంగ్కాంగ్లో ప్రస్తుతం వైరస్ కేసులు ాచాలా ఎక్కువగా్ణ ఉన్నాయని నగర ఆరోగ్య పరిరక్షణ కేంద్రంలోని అంటువ్యాధుల విభాగం అధిపతి అల్బర్ట్ స్థానిక మీడియాకు తెలిపారు. ఇటీవల కాలంలో హాంగ్కాంగ్లో శ్వాసకోశ నమూనాల్లో కోవిడ్ పాజిటివ్గా తేలుతున్న వారి శాతం గతేడాది ఇదే సమయంతో పోలిస్తే అత్యధిక స్థాయికి చేరింది. మే 3తో ముగిసిన వారంలో తీవ్రమైన కేసులు, మరణాలు కూడా దాదాపు ఏడాది గరిష్ఠ స్థాయికి చేరి 31గా నమోదయ్యాయని సెంటర్ ఫర్ హెల్త్ ప్రొటెక్షన్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గత రెండేళ్లలో చూసినంత తీవ్రస్థాయిలో ప్రస్తుత వ్యాప్తి లేనప్పటికీ, మురుగునీటిలో పెరుగుతున్న వైరల్ లోడ్, కోవిడ్ సంబంధిత వైద్య సంప్రదింపులు, ఆసుపత్రులలో చేరికలు వంటివి 70 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరంలో వైరస్ చురుకుగా వ్యాపిస్తోందని సూచిస్తున్నాయి.
సింగపూర్లో 14వేలకు పైగా కేసులు
ఆసియా ఆర్థిక కేంద్రంగా పేరొందిన సింగపూర్ కూడా కోవిడ్ విషయంలో అప్రమత్తమైంది. నగర ఆరోగ్య మంత్రిత్వ శాఖ దాదాపు ఏడాది తర్వాత ఈ నెలలో తొలిసారిగా ఇన్ఫెక్షన్ల సంఖ్యపై అధికారిక ప్రకటన విడుదల చేసింది. మే 3తో ముగిసిన వారంలో అంతకుముందు ఏడు రోజులతో పోలిస్తే కేసుల సంఖ్య 28 శాతం పెరిగి 14,200కు చేరింది. రోజువారీ ఆసుపత్రి చేరికలు కూడా సుమారు 30 శాతం పెరిగాయి. సాధారణంగా కేసుల సంఖ్య గణనీయంగా పెరిగినప్పుడు మాత్రమే సింగపూర్ ఆరోగ్య శాఖ వివరాలను వెల్లడిస్తుంది. ప్రజల్లో రోగనిరోధక శక్తి తగ్గడం వంటి కారణాల వల్ల కేసులు పెరుగుతున్నప్పటికీ ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న వేరియంట్లు మహమ్మారి సమయంలో ఉన్నంత వేగంగా వ్యాపించేవి లేదా మరింత తీవ్రమైనవి అనడానికి ఆధారాలు లేవని సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
గత కొన్ని నెలలుగా ఆసియా వ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో ఈ రెండు ప్రధాన నగరాల్లో తాజా ఉద్ధృతి ఆందోళన కలిగిస్తోంది. టీకాలు క్రమం తప్పకుండా తీసుకోవాలని, ముఖ్యంగా అధిక ప్రమాదం ఉన్నవారు బూస్టర్ డోసులు వేసుకోవాలని ఆరోగ్య అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. చలికాలంలో ఎక్కువగా క్రియాశీలంగా ఉండే ఇతర శ్వాసకోశ వ్యాధుల మాదిరిగా కాకుండా, ఉత్తరార్ధగోళంలో వేసవి కాలం ప్రవేశిస్తున్న తరుణంలో కోవిడ్ మళ్లీ విజృంభించడం, అధిక ఉష్ణోగ్రతలలో కూడా వైరస్ పెద్ద సంఖ్యలో ప్రజలను అనారోగ్యానికి గురిచేయగలదని స్పష్టం చేస్తోంది.
కరోనా బారిన గాయకుడు
ఇదిలా ఉండగా, హాంగ్కాంగ్ గాయకుడు ఈసన్ చాన్ కూడా కోవిడ్ బారిన పడ్డారు. దీంతో ఈ వారం చివర్లో తైవాన్లోని కాయోషియంగ్లో జరగాల్సిన తన కచేరీలను రద్దు చేసుకోవాల్సి వచ్చిందని కచేరీ నిర్వాహకులు చైనా సోషల్ మీడియా వేదిక వీబోలో గురువారం తెలిపారు. చైనాలో కూడా గత ఏడాది వేసవిలో నమోదైన గరిష్ఠ స్థాయికి కోవిడ్ కేసులు చేరే అవకాశం ఉందని చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ గణాంకాలు సూచిస్తున్నాయి. మే 4తో ముగిసిన ఐదు వారాల్లో దేశవ్యాప్తంగా ఆసుపత్రులలో రోగ నిర్ధారణ కోసం వచ్చిన రోగులలో కోవిడ్ టెస్ట్ పాజిటివిటీ రేటు రెట్టింపు కంటే ఎక్కువైంది. థాయ్లాండ్లో ఈ ఏడాది రెండు క్లస్టర్ వ్యాప్తి ఘటనలు నమోదయ్యాయని, ఏప్రిల్లో జరిగిన వార్షిక సాంగ్క్రాన్ పండుగ తర్వాత కేసులు పెరిగాయని ఆ దేశ వ్యాధి నియంత్రణ విభాగం నివేదించింది.