రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు ప్రజాప్రతినిధులు, నేతలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
జకాత్ .. మానవత్వానికి ప్రతిరూపం.. చంద్రబాబు
నెల రోజులపాటు కఠిన ఉపవాస దీక్షలు, ఖురాన్ పఠనం, ప్రార్థనలతో రంజాన్ మాసం ముగిసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. జకాత్ పేరుతో సాటి వారిని ఆదుకునే దయాగుణం ముస్లిం వర్గంలోని మానవత్వానికి ప్రతిరూపమని ఆయన పేర్కొన్నారు. పేద కుటుంబాల సముద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు అల్లా దయ వల్ల విజయవంతం కావాలని చంద్రబాబు ఆకాంక్షిస్తూ అందరికీ పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
అందరికీ ఈద్ ముబారక్ ..పవన్ కల్యాణ్
ఇస్లాంపై విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు అంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఖురాన్ అవతరించిన పవిత్ర మాసం ఇది అని ఆయన అన్నారు.
ప్రేమ, శాంతి, సౌభ్రాతృత్వానికి ప్రతీక.. జగన్
భక్తిశ్రద్ధలతో కఠినమైన ఉపవాస దీక్షలు ముగించుకుని ప్రేమ, శాంతి, సౌభ్రాతృత్వానికి ప్రతీక అయిన రంజాన్ పండుగను జరుపుకుంటున్న ముస్లిం సోదర సోదరీమణులందరికీ శుభాకాంక్షలు అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. అల్లా చూపిన మార్గంలో నడవాలని, అల్లా చల్లని దీవెనలు అందరికీ ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానన్నారు.