చైనా, అమెరికా మధ్య తారస్థాయికి సుంకాల యుద్ధం
చైనా దిగుమతి వస్తువులపై సుంకం 145 నుంచి 245 శాతానికి పెంపు
యూఎస్ వస్తువులపై చైనా 125 శాతం సుంకం
చైనా దిగుమతి సుంకాలు పెంచినందుకే ఈ చర్య అన్న వైట్హౌస్
అగ్రరాజ్యం అమెరికా, డ్రాగన్ కంట్రీ చైనా మధ్య సుంకాల యుద్ధం తారస్థాయికి చేరింది. చైనా దిగుమతి వస్తువులపై సుంకాన్ని డొనాల్డ్ ట్రంప్ సర్కార్ 145 శాతం నుంచి 245 శాతానికి పెంచేసింది. తమ వస్తువులపై ప్రతీకారంగా చైనా దిగుమతి సుంకాలు పెంచిన నేపథ్యంలో ఈ చర్యకు దిగినట్లు అధికార భవనం వైట్హౌస్ వెల్లడించింది.అమెరికా దిగుమతి సుంకాన్ని పెంచిన నేపథ్యంలో.. రెండు రోజుల క్రితం చైనా కూడా కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా సంస్థ బోయింగ్ ఉత్పత్తి చేస్తున్న విమానాలను కొనుగోలు చేయవద్దని తమ దేశ విమానయాన సంస్థలను చైనా ఆదేశించిన విషయం తెలిసిందే.బోయింగ్ సంస్థ నుంచి విడిభాగాలు కూడా కొనుగోలు చేయరాదు అని చైనా తమ దేశ ఎయిర్లైన్స్ సంస్థలను ఆదేశించింది. ఈ ప్రకటన వెలువడిన మరుసటి రోజే అమెరికా ప్రతీకార చర్యకు పాల్పడింది. చైనా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై సుంకాన్ని ఏకంగా 245 శాతానికి పెంచినట్లు శ్వేతసౌధం వెల్లడించింది.
దీంతో చైనా నుంచి దిగుమతి అయ్యే వస్తువుల ధరలు అమెరికాలో విపరీతంగా పెరగనున్నాయి. ఫలితంగా అమెరికన్లు చైనా వస్తువులను కొనుగోలు చేయడం ఆపేయడంతో ఆ దేశ కంపెనీలు తీవ్రంగా నష్టపోతాయి. కాగా, యూఎస్ వస్తువులపై చైనా 125 శాతం సుంకాన్ని విధిస్తున్న విషయం తెలిసిందే.