మయన్మార్ దేశాన్ని అత్యంత శక్తిమంతమైన భూకంపం వణికించిన విషయం తెలిసిందే. ఈ విపత్తులో భారీ సంఖ్యలో ముస్లింలు ప్రాణాలు కోల్పోయినట్లు మయన్మార్ ముస్లిం సంస్థ నేడు తాజాగా తెలిపింది. పవిత్ర రంజాన్ మాసంలో శుక్రవారం ప్రార్థనల సమయంలో 7.7 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపం ధాటికి 700 మందికి పైగా ముస్లింలు మరణించారని వెల్లడించింది. అంతేకాదు దాదాపు 60 మసీదులు ధ్వంసమైనట్లు మయన్మార్ ముస్లిం నెట్వర్క్ స్టీరింగ్ కమిటీ సభ్యుడు తున్ కీ తెలిపారు. అనేక మసీదులు దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు.
గత శుక్రవారం మధ్యాహ్నం సమయంలో నిమిషాల వ్యవధిలోనే సంభవించిన రెండు భూకంపాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఈ విపత్తులో ఇప్పటి వరకూ 1,700 మంది ప్రాణాలు కోల్పోయినట్లు మయన్మార్ స్టేట్ మీడియా వెల్లడించింది. అయితే, ఆ సంఖ్య 2,028 అని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. దాదాపు 3,400 మంది గాయపడ్డారని. 300 మంది ఆచూకీ గల్లంతైందని కూడా వెల్లడించింది. ఇక థాయ్ లాండ్ లో ఇప్పటి వరకు 143 మంది మరణించినట్లు ఆ దేశ ప్రదాని ప్రకటించారు.. ప్రస్తుతం ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
334 అణు బాంబుల విధ్వంసంతో సమానం
మయన్మార్తోపాటు థాయ్లాండ్లో ఈ నెల 28న 12 నిమిషాల వ్యవధిలో సంభవించిన రెండు భారీ భూకంపాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఈ భూకంపం 334 అణు బాంబులతో సమానమైన శక్తిని విడుదల చేసి వినాశనాన్ని సృష్టించిందని స్థానిక భూ విజ్ఞాన శాస్త్రవేత్త జెస్ ఫీనిక్స్ పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో మరిన్ని భూప్రకంపనలు వచ్చే అవకాశముందని ఆమె హెచ్చరించారు.