ఎన్నికల సంఘంపై రాహుల్ మళ్లీ తీవ్ర విమర్శలు..
కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మళ్లీ తీవ్ర విమర్శలు గుప్పించారు.
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కోసం ఈసీ ఓట్లను దోచుకుంటోందని ఆయన ఆరోపించారు.
ఈ ఆరోపణకు మద్దతుగా తమ వద్ద “అణుబాంబు” లాంటి బలమైన ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఈ ఆరోపణలపై ఎన్నికల సంఘం గట్టి ప్రతిస్పందన ఇచ్చింది. రాహుల్ చేసిన వ్యాఖ్యలకు స్పందించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
లోక్సభ ఎన్నికల సమయంలోనూ ఈఅక్రమాలు చోటుచేసుకున్నాయి
బిహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో,ఆరాష్ట్రంలో ఓటరు జాబితా కోసం ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)ప్రక్రియను ఎన్నికల సంఘం ప్రారంభించింది. తాజాగా ముసాయిదా ఓటరు జాబితాను ఈసీ విడుదల చేసింది.అయితే ఈప్రక్రియపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మొదటినుంచే వ్యతిరేకంగా స్పందిస్తున్నారు. ఈనేపథ్యంలో తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ,”మేము రాష్ట్ర స్థాయిల నుంచి ఓట్ల దోపిడీ జరుగుతోందని అనుమానించాము.ఇదంతా కొత్త కాదు.మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోనూ ఇదే తరహా అక్రమాలు జరిగాయి.లోక్సభ ఎన్నికల సమయంలోనూ ఈ అక్రమాలు చోటుచేసుకున్నాయి.ఓటరు జాబితా సవరణ పేరిట కోట్లాది మంది కొత్త ఓటర్లను అక్రమంగా జత చేస్తున్నారు.దీనిపై మేము ఆరునెలలు పాటు స్వతంత్రంగా దర్యాప్తు జరిపాము.దాని ఫలితంగా అణుబాంబు లాంటి ఆధారాలను గుర్తించాం.అవి బయటపెడితే,ఎన్నికల సంఘానికి దాక్కోవడానికి అవకాశమే”అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ మరింత ముందుకు వెళ్లి, ఎన్నికల సంఘం చేసిన చర్యలను దేశద్రోహంతో పోల్చారు. ”భాజపాను గెలిపించేందుకు ఈసీ ఈ విధంగా ఓట్ల దోపిడీ చేస్తోంది. ఇది దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా సాగుతున్న చర్య. ఇది దేశద్రోహం కంటే తక్కువేమీ కాదు. అధికారంలో ఉన్నవారు, రిటైర్ అయినా సరే.. ఎవరూ తప్పించుకోలేరు. దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తే ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు” అని స్పష్టంగా హెచ్చరించారు.
రాహుల్ వ్యాఖ్యలను ఖండించిన ఈసీ
విపక్షాల నుండి వస్తున్న ఆరోపణలను ఎన్నికల సంఘం తీవ్రంగా ఖండించింది.
అవన్నీ ఆధార రహితమైనవి అని తేల్చిచెప్పింది. ప్రతిరోజూ వస్తున్న బెదిరింపులను తాము పట్టించుకోమని తెలిపింది. రాహుల్ గాంధీ లాంటి నేతలు చేసే బాధ్యతారహిత వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేదని ఈసీ అభిప్రాయపడింది. తమ అధికారులను ఈ అంశాలను పట్టించుకోకుండా పారదర్శకంగా పనిచేయాలని సూచించామని స్పష్టం చేసింది.


