జేఈఈ మెయిన్ 2025 సెషన్ 2 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (National Testing Agency) ఏప్రిల్ 19న విడుదల చేయనుంది. ఫైనల్ ఆన్సర్ కీ మాత్రం ఏప్రిల్ 18వ తేదీ మధ్యాహ్నం 2 గంటల తర్వాత అందుబాటులో ఉందని ఎన్టీఏ స్పష్టం చేసింది. ఈ ఏడాది జనవరిలో జేఈఈ మెయిన్ సెషన్ 1 పరీక్షలు జరుగగా.. ఏప్రిల్ 2 నుంచి 9వ తేదీ వరకు సెషన్ 2 పరీక్షలు జరిగాయి. ఏప్రిల్ 2, 3, 4, 7, 8 తేదీల్లో పేపర్-1 (బీఈ/ బీటెక్) పరీక్షలు, ఏప్రిల్ 9వ తేదీన పేపర్-2ఏ, 2బీ (బీఆర్క్/ బీ ప్లానింగ్) ప్రవేశ పరీక్షలు విజయవంతంగా నిర్వహించారు. అయితే ఈ రెండు విడతల పరీక్షల్లోని ఉత్తమ స్కోర్ను పరిగణనలోకి తీసుకొని విద్యార్ధులకు ర్యాంకులు కేటాయిస్తారు.
Joint Entrance Examination JEE Main Session 2 పరీక్షకు హాజరైన విద్యార్థులు అధికారిక వెబ్సైట్ https://jeemain.nta.nic.in/ ద్వారా రిజల్ట్ చెక్ చేసుకోవచ్చు. ఫైనల్ ఆన్సర్ కీ, స్కోర్ కార్డ్ చెక్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ ఇదే. కేటగిరీల వారీగా కటాఫ్ స్కోర్ నిర్ణయించి ర్యాంకులు ప్రకటిస్తారు. సెషన్ 1, సెషన్ 2 కలిపి ఉత్తమ స్కోర్ సాధించిన మొత్తం 2.50 లక్షల మందికి జేఈఈ అడ్వాన్స్డ్ 2025 పరీక్షకు అర్హత సాధించినట్లు ప్రకటిస్తారు. అంటే వారు మాత్రమే జేఈఈ అడ్వాన్స్డ్ 2025 ఎగ్జామ్ రాసేందుకు అర్హులన్నమాట. ఏప్రిల్ 23 నుంచి జేఈఈ అడ్వాన్స్డ్ 2025 రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. ఫలితాల విడుదల తర్వాత ఈ అంశంపై కూడా పూర్తి స్పష్టత వస్తుంది.
ఎన్టీఏ కీలక ప్రకటన:
జేఈఈ మెయిన్ పరీక్ష జవాబుల ఫైనల్ ఆన్సర్ కీ వచ్చేవరకు విద్యార్థులు వేచి చూడాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పేర్కొంది. ప్రాథమిక ‘కీ’లలో తప్పిదాల ఆధారంగా ఓ నిర్ణయానికి రావొద్దని సూచించింది. జేఈఈ-మెయిన్ సెషన్ 2 పరీక్ష సమాధానాల్లో పలు తప్పిదాలు ఉన్నాయని ఫిర్యాదులు వస్తుండడంతో ఈ మేరకు ఎన్టీఏ (National Testing Agency) ఓ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటి వరకు ప్రాథమిక కీ మాత్రమే విడుదల చేశామని.. ఫైనల్ కీని విడుదల చేయలేదని పేర్కొంది. ఫైనల్ ఆన్సర్ కీ మాత్రమే స్కోరును నిర్ణయిస్తుంది.. ప్రాథమిక కీల ఆధారంగా విద్యార్థులు ఓ నిర్ణయానికి రావొద్దని ఎన్టీఏ సూచించింది.