తెలంగాణ-చత్తీస్గఢ్ సరిహద్దులోని బీజాపూర్ జిల్లా ధర్మ తాళ్లగుడెం పరిధిలోని కర్రెగుట్టల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఇందులో 38 మంది మావోయిస్టులు మృతిచెందినట్టు సమాచారం. గతవారం రోజులుగా కర్రెగుట్టలే లక్ష్యంగా భద్రతా దళాలు ఆపరేషన్ కగార్ చేపట్టిన విషయం తెలిసిందే. సుమారు 5500 మందితో డీఆర్జీ బస్తర్ ఫైటర్ కోబ్రా, సీఆర్పీఎఫ్, ఎస్టీఎఫ్ సైనికులు భారీ కూంబింగ్ చేస్తున్నాయి.
ఈ క్రమంలో ఈరోజు జరిగిన ఎదురు కాల్పుల్లో సుమారు 38 మంది నక్సలైట్లు మృతిచెందినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య ఇంకా భారీగా పెరిగే అవకాశం ఉందని సమాచారం. కానీ, మావోల మృతిపై ఇప్పటివరకు అధికారులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
కాగా, కర్రెగుట్టల కూంబింగ్ కొనసాగుతున్న వేళ శుక్రవారం మధ్యాహ్నం బస్తర్ మావోయిస్టుల ఇంచార్జ్ పేరిట లేఖ ఒకటి విడుదలైంది. ఆ లేఖలో ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపి వేయాలని, తాము శాంతి చర్చలకు సిద్దమని కేంద్రంతో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు మావోలు విజ్ఞప్తి చేశారు.