టెన్త్ ఫలితాలను ఎక్స్వే దికగా విడుదల చేసిన మంత్రి లోకేశ్
పదో తరగతి ఫలితాల్లో 81.14 శాతం మంది ఉత్తీర్ణత
1,680 స్కూళ్లలో 100 శాతం ఉత్తీర్ణత నమోదు
పార్వతీపురం మన్యం జిల్లాలో అత్యధికంగా 93.90 శాతం ఉత్తీర్ణత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్ధులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు-2025 మంత్రి నారా లోకేశ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా విడుదల చేశారు. పదో తరగతి, ఓపెన్ స్కూల్ ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు. పదో తరగతి ఫలితాల్లో 81.14 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో అబ్బాయిలు 78.31 శాతం, అమ్మాయిలు 84.09 శాతం ఉత్తీర్ణులయ్యారు.
అలాగే 1,680 స్కూళ్లలో వంద శాతం ఉత్తీర్ణత నమోదైంది. 19 స్కూళ్లలో సున్నా శాతం ఉత్తీర్ణత నమోదు కాగా… పార్వతీపురం మన్యం జిల్లాలో అత్యధికంగా 93.90 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
ఈ ఫలితాలు చాలా సంతోషాన్నిచ్చాయి: మంత్రి నారా లోకేశ్
ఈ సంవత్సరం 6,14,459 మంది విద్యార్థులు పరీక్ష రాయగా… 4,98,585 మంది ఉత్తీర్ణులై 81.14% ఉత్తీర్ణత నమోదైంది. పార్వతీపురం మన్యం జిల్లా 93.90% ఉత్తీర్ణత రేటుతో అగ్రస్థానంలో ఉండటం, 1,680 పాఠశాలలు 100% ఫలితాలు సాధించడం చూసి నేను సంతోషంగా ఉన్నాను.
ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. విజయం సాధించని వారు నిరుత్సాహపడకండి. జీవితం రెండవ అవకాశాలను అందిస్తుంది. సప్లిమెంటరీ పరీక్షలు మే 19 నుంచి 28 వరకు జరుగుతాయి. ఇది విజయం సాధించడానికి మరొక అవకాశాన్ని అందిస్తుంది. ఫలితాల కోసం http:// bse.ap.gov.in, http:// results.bse.ap.gov.inతో పాటు వాట్సాప్ (మన మిత్ర): 95523 00009 కు హాయ్ అని పంపండి అని మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు.
ప్రభుత్వం ఇటీవల లీప్ (LEAP) అనే మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. దీని ద్వారా ఉపాధ్యాయులు, ప్రధనోపాధ్యాయులు వారి పాఠశాలల్లోని విద్యార్థుల ఫలితాలు చూసుకోవచ్చు. ఇక ఇదే యాప్లో తల్లిదండ్రులు కూడా లాగిన్ అయి… వారి పిల్లల ఫలితాలను చూసుకునే వెసులుబాటు ఉంటుంది.