దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నీట్ యూజీ 2025 పరీక్ష ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచి సత్తా చాటారు. జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) అధికారులు ఈ ఫలితాలను అధికారికంగా ప్రకటించారు. వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 4వ తేదీన నీట్ యూజీ పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇటీవల ప్రాథమిక కీ ని విడుదల చేసి, అభ్యంతరాలను స్వీకరించిన అనంతరం ఎన్టీఏ తుది ఫలితాలను వెల్లడించింది. అభ్యర్థులు తమ స్కోర్ కార్డులను ఈమెయిల్ ద్వారా లేదా తమ వ్యక్తిగత లాగిన్ వివరాలతో అప్లికేషన్ నంబర్ను ఎంటర్ చేసి చూసుకోవచ్చని ఎన్టీఏ సూచించింది. ఈసారి ఫలితాల్లో తెలుగు విద్యార్థులు తమ సత్తా చాటారు. తెలంగాణ నుంచి ఏకంగా 41,584 మంది విద్యార్థులు నీట్లో అర్హత సాధించగా, ఆంధ్రప్రదేశ్ నుంచి 36,776 మంది ఉత్తీర్ణత సాధించారు. తెలంగాణకు చెందిన కాకర్ల జీవన్ సాయికుమార్ జాతీయ స్థాయిలో 18వ ర్యాంకును కైవసం చేసుకోగా, షణ్ముఖ నిషాంత్ 37వ ర్యాంకు, మంగరి వరుణ్ 46వ ర్యాంకు, యండ్రపాటి షణ్ముఖ్ 48వ ర్యాంకు సాధించి రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారు. ఆంధ్రప్రదేశ్ నుంచి దర్బా కార్తీక్రామ్ 19వ ర్యాంకు, కొడవటి మోహిత్ శ్రీరామ్ 56వ ర్యాంకు సాధించి ప్రతిభ కనబరిచారు. దేశంలోని వివిధ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్ఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్ఎంఎస్ వంటి కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా సుమారు 22 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు.