రూ.3 వేలు దాటితే ఛార్జీలంటూ ప్రచారం
అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని కేంద్రం వివరణ
డిజిటల్ చెల్లింపుల్లో 83 శాతానికి చేరిన యూపీఐ లావాదేవీలు
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ద్వారా రూ.3 వేలకు మించి చేసే చెల్లింపులపై 0.3% మర్చంట్ డిస్కౌంట్ రేటు (ఎండీఆర్) విధిస్తారంటూ బుధవారం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే, ఈ వార్తలను కేంద్ర ఆర్థిక శాఖ ఖండించింది. అలాంటి ప్రతిపాదన ఏదీ తమ వద్ద లేదని స్పష్టం చేసింది. దీంతో యూపీఐ వినియోగదారులకు ఊరట లభించినట్లయింది. దేశంలో డిజిటల్ లావాదేవీల్లో యూపీఐ వాటా ఏకంగా 83 శాతానికి చేరింది. ఈ నేపథ్యంలో, యూపీఐ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) పలు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా, యూపీఐ యాప్ల ద్వారా బ్యాంకు ఖాతాలోని నగదు నిల్వను పరిశీలించే (బ్యాలెన్స్ చెక్) సదుపాయంపై పరిమితులు విధించాలని నిర్ణయించింది. యూపీఐ వ్యవస్థపై అధిక ఒత్తిడిని తగ్గించడమే దీని ముఖ్య ఉద్దేశమని తెలుస్తోంది.
ప్రభుత్వం 2020 జనవరిలో యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ను రద్దు చేసిన తర్వాత, ఈ తరహా చెల్లింపులు భారీగా పెరిగాయి. దీనికి అవసరమైన సాంకేతిక మౌలిక సదుపాయాల కోసం బ్యాంకులు, గూగుల్పే, ఫోన్పే వంటి చెల్లింపు సేవల సంస్థలు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెడుతున్నాయి. ప్రస్తుతం డెబిట్, క్రెడిట్ కార్డు లావాదేవీలపై 0.9% నుంచి 2% వరకు ఎండీఆర్ ఛార్జీ వసూలు చేస్తుండగా, ఎన్పీసీఐ నెట్వర్క్ పరిధిలోని రూపే కార్డులపై ఎలాంటి ఛార్జీలు లేవు. అలాగే, రూ.2,000 దాటిన ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్ (పీపీఐ) యూపీఐ లావాదేవీలపై 1.1% ఇంటర్ఛేంజ్ ఫీజు వర్తిస్తోంది.
యూపీఐ లావాదేవీలపై ప్రజల నుంచి ఎలాంటి రుసుములు వసూలు చేయకుండా, ఆ భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఏటా రూ.1,500 కోట్లు అందిస్తోంది. అయితే, లావాదేవీల సంఖ్య విపరీతంగా పెరగడంతో ఈ మొత్తం సరిపోవడం లేదని, కనీసం రూ.10,000 కోట్లు అవసరమని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే యూపీఐ ఛార్జీలపై తాజా ఊహాగానాలు తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. ఏదేమైనా, ప్రస్తుతానికి ఎలాంటి కొత్త ఛార్జీలు విధించడం లేదని ఆర్థిక శాఖ స్పష్టం చేయడంతో వినియోగదారులు ఊపిరి పీల్చుకున్నారు.