పహల్గాంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడి ఘటన అనంతరం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఉన్న పాకిస్థాన్ జాతీయులకు సంబంధించిన వీసాలను రద్దు చేయాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి, తమ రాష్ట్రాల్లో ఉన్న పాక్ పౌరులను గుర్తించి, వారిని వెనక్కి పంపేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అమిత్ షా ఈ అంశంపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అనంతరం, దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆయన ఫోన్లో సంప్రదింపులు జరిపారు. ఈ మేరకు పాకిస్థాన్కు చెందిన వారిని త్వరగా వెనక్కి పంపేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భారత్లో ఉన్న పాకిస్థాన్ పౌరుల వీసాలను రద్దు చేసే ప్రక్రియను చేపట్టాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర హోంమంత్రి సూచించినట్లు సమాచారం. ఈ నెల 27వ తేదీ నాటికి అన్ని వీసాలు రద్దవుతాయని కేంద్రం తెలిపింది. ఇటీవల చోటుచేసుకున్న ఉగ్రవాద దాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.