ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ వేకువజామున సుప్రభాతసేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు లెజినోవాకు స్వాగతం పలకగా.. స్వామి వారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు. టీటీడీ అధికారులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం నుంచి అఖిలాండం వద్దకు చేరుకుని టెంకాయలు కొట్టి కర్పూర హారతులు సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు. అనంతరం బేడీ ఆంజనేయ స్వామిని దర్శించుకుని గాయత్రి నిలయానికి వెళ్లారు. అనంతరం తరిగొండ వెంగమాంబ అన్నవితరణ కేంద్రానికి చేరుకుని అన్నప్రసాదాలు స్వీకరించారు.
మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుటుంబం శ్రీవారికి భారీ విరాళం అందించింది. ఈ మేరకు తిరుమలలోని టీటీడీ ఎస్వీ అన్నదానం ట్రస్టుకు విరాళాన్ని అందజేసింది. కుమారుడు మార్క్ శంకర్ పేరుతో ఒకపూట మధ్యాహ్నం అన్న ప్రసాదానికి అయ్యే ఖర్చు రూ.17 లక్షలు విరాళంగా అందజేశారు. గతవారం సింగపూర్లో మార్క్ శంకర్కు అగ్ని ప్రమాదం జరగగా.. గాయాలైన సంగతి తెలిసిందే. అయితే కుమారుడు పెద్ద ప్రమాదం నుంచి బయటపడటంతో అన్నాలెజినోవా శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
అంతకముందు ఆదివారం అన్నాలెజినోవా తిరుమలకు చేరుకున్నారు. ఆమెకు టీటీడీ అధికారులు స్వాగతం పలకగా.. అనంతరం పద్మావతి విచారణ కార్యాలయం ద్గర తలనీలాలు సమర్పించారు. అనంతరం భూవరాహ స్వామిని దర్శించుకుని.. రాత్రికి తిరుమలలోని గాయత్రి నిలయంలో బస చేశారు. సోమవారం వేకువజామన లెజినోవా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శనివారం తన కుమారుడు మార్క్ శంకర్, సతీమణి లెజినోవాతో కలిసి సింగపూర్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు.
కొడుకు, భార్యతో హైదరాబాద్ చేరుకున్న పవన్ కళ్యాణ్..
ఈ నెల 8న మార్క్ శంకర్కు సింగపూర్లోని రివర్ వ్యాలీ ప్రాంతంలో టమాటో కుకింగ్ స్కూల్లో అగ్నిప్రమాదం జరిగింది.. ఆ ఘటనలో పవన్ కుమారుడికి గాయాలయ్యాయి. వెంటనే సింగపూర్లోని ఆసుపత్రికి తరలించగా.. అక్కడ ఐదు వైద్య సేవల తర్వాత డిశ్చార్జ్ అయ్యారు. అనంతరం శనివారం అర్ధరాత్రి పవన్ కళ్యాణ్, తన కుమారుడు మార్క్ శంకర్, భార్య అన్నా లెజినోవాతో పాటు హైదరాబాద్ వచ్చారు.