మేయర్ పై పెట్టిన అవిశ్వాసంలో కూటమి ఘన విజయం
జీవీఎంసీ కార్యాలయం వద్ద కూటమి నేతల సంబరాలు
వైసీపీకి మరో షాక్ తగిలింది. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ను వైసీపీ కోల్పోయింది. జీవీఎంసీ వైసీపీ మేయర్ గొలగాని హరి వెంకట కుమారిపై కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. విశాఖ మేయర్ పీఠం కూటమి వశమయింది. ఈ ఉదయం 11 గంటలకు జీవీఎంపీ ఇన్ఛార్జ్ కమిషనర్, కలెక్టర్ హరేంధిరప్రసాద్ అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం ప్రారంభమయింది. ఇప్పటికే వైసీపీ కార్పొరేట్లర్లు ఒక్కొక్కరుగా పార్టీని వీడటంతో కూటమి బలం పెరిగింది. జీవీఎంసీలో మొత్తం 97 మంది సభ్యులు ఉన్నారు. ఈనాటి సమావేశానికి ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిసి 74 మంది కూటమి సభ్యులు హాజరయ్యారు. వీరంతా అవిశ్వానికి మద్దతుగా ఓటు వేశారు. పార్టీ మారిన కార్పొరేటర్లను కట్టడి చేసేందుకు వైసీపీ విప్ జారీ చేసినా వ్యూహం ఫలించలేదు.
మరోవైపు కౌన్సిల్ సమావేశాన్ని వైసీపీ సభ్యులు బహిష్కరించారు. దీంతో, వైసీపీ మేయర్ హరి వెంకట కుమారి పదవిని కోల్పోయారు. అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో జీవీఎంసీ కార్యాలయం వద్ద కూటమి నేతలు సంబరాలు చేసుకున్నారు. బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచుకుని వేడుక చేసుకున్నారు.