తెలంగాణ అంతటా విస్తరించిన నైరుతి రుతుపవనాలు
రాష్ట్రంలో రాబోయే ఐదు రోజులు వర్ష సూచన
నేడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడొచ్చని అంచనా
హైదరాబాద్లోని అనేక ప్రాంతాల్లో వర్షం, రోడ్లు జలమయం
తెలంగాణ రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా విస్తరించడంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. రానున్న ఐదు రోజుల పాటు తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ విభాగం శుక్రవారం వెల్లడించింది.వాతావరణ శాఖ అధికారుల వివరాల ప్రకారం, రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో రాష్ట్రంలోని దక్షిణ, పశ్చిమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని వారు హెచ్చరించారు. ఈరోజు ఉమ్మడి మహబూబ్నగర్, నిజామాబాద్, మెదక్, నల్గొండ జిల్లాలతో పాటు వికారాబాద్ జిల్లాలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మరోవైపు, రుతుపవనాల ప్రభావంతో హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం వర్షం కురిసింది. బేగంబజార్, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, బషీర్బాగ్, నాంపల్లి, లిబర్టీ, హిమాయత్నగర్, నారాయణగూడ, లక్డీకపూల్, ఖైరతాబాద్, ట్యాంక్బండ్ పరిసర ప్రాంతాల్లో రోడ్లు నీటితో నిండిపోయాయి. దీంతో పలుచోట్ల ట్రాఫిక్ స్తంభించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.