అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలస విధానంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు. వ్యవసాయ రంగం, హోటళ్లు, రెస్టారెంట్లపై ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐస్) అధికారులు నిర్వహిస్తున్న దాడులు, అరెస్టులను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించారు. తన అధ్యక్ష పదవికి కీలకమైన కొన్ని పరిశ్రమలు, నియోజకవర్గాలకు నష్టం వాటిల్లుతుండటంతో సామూహిక బహిష్కరణ ప్రచారంలో ఈ మార్పు చేసినట్టు న్యూయార్క్ టైమ్స్ నివేదిక వెల్లడించింది. ఐస్ సీనియర్ అధికారి టాటమ్ కింగ్ ఆ శాఖ ప్రాంతీయ నాయకులకు ఈ మేరకు ఒక ఈమెయిల్ పంపినట్టు సమాచారం. ఈ రోజు నుంచి వ్యవసాయం (ఆక్వాకల్చర్, మాంసం ప్యాకింగ్ ప్లాంట్లతో సహా), రెస్టారెంట్లు, నడుస్తున్న హోటళ్లపై వర్క్సైట్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తులు/ఆపరేషన్లను నిలిపివేయండి అని ఆ సందేశంలో పేర్కొన్నట్టు తెలిసింది. అయితే, ఈ పరిశ్రమల్లోకి జరిగే మానవ అక్రమ రవాణా, మనీలాండరింగ్, డ్రగ్ స్మగ్లింగ్ఁ వంటి తీవ్రమైన నేరాలకు సంబంధించిన దర్యాప్తులు కొనసాగుతాయని స్పష్టం చేశారు. అంతేకాకుండా, ఎలాంటి నేరచరిత్ర, పత్రాలు లేని వలసదారులను (నాన్క్రిమినల్ కొల్లేటరల్స్) కస్టడీలోకి తీసుకోవద్దని కూడా ఏజెంట్లను ఆదేశించినట్టు సమాచారం.
ఈ తాజా పరిణామాలను అమెరికా హోంలాండ్ సెక్యూరిటీ విభాగం ధ్రువీకరించింది. ఁమేము అధ్యక్షుడి ఆదేశాలను పాటిస్తాం. అమెరికా వీధుల నుంచి అత్యంత ప్రమాదకరమైన నేరస్తులైన అక్రమ వలసదారులను ఏరివేయడానికి మా ప్రయత్నాలు కొనసాగిస్తాంఁ అని ఆ శాఖ ప్రతినిధి ట్రిసియా మెక్లాఫ్లిన్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఇటీవల దక్షిణ కాలిఫోర్నియాలోని పలు ప్రాంతాల్లో ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐస్) అధికారులు, ఇతర ఫెడరల్ ఏజెన్సీలు జరిపిన దాడుల అనంతరం తీవ్ర నిరసనలు వెల్లువెత్తిన నేపథ్యంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ వారం ప్రారంభంలో, లాస్ ఏంజెలెస్కు తూర్పున 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న శాంటా అనాలో వలస దాడులకు వ్యతిరేకంగా జరిగిన నిరసన హింసాత్మకంగా మారి పలువురు గాయపడగా, కొందరిని అరెస్ట్ చేశారు. ఆరెంజ్ కౌంటీ రాజధాని అయిన శాంటా అనాలో ఐస్ అధికారులు ఆ రోజు జరిపిన దాడులే ఈ నిరసనలకు కారణమయ్యాయి. ఇక్కడ 3 లక్షలకు పైగా జనాభా నివసిస్తున్నారు.
అధికారులు రోజువారీ కూలీలను లక్ష్యంగా చేసుకున్నట్టు కనబడుతోందని ఆరెంజ్ కౌంటీ సూపర్వైజర్ విసెంటె సర్మియెంటో ఆరెంజ్ కౌంటీ రిజిస్టర్ః వార్తాపత్రికకు తెలిపారు. సుమారు 200 మంది నిరసనకారులు జెండాలు ఊపుతూ, ప్లకార్డులు ప్రదర్శిస్తూ శాంటా అనా నగరంలోని ఫెడరల్ భవనం వెలుపల గుమిగూడారు. ఈ భవనంలోనే ఐస్ కార్యాలయాలు, ఇతర ఫెడరల్ విభాగాల ఆఫీసులు ఉన్నాయి. ఆ తర్వాత, పోలీసులు నిరసనకారులపై కాల్పులు జరిపినట్టు ఆరోపణలు రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.