ఉగ్రదాడి ఘటన దేశం మొత్తాన్ని కుదిపేసిందని.. పహల్గామ్ ప్రకంపనలు దేశమంతా వ్యాపించాయని తెలిపారు డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ .. షికారుకు వచ్చినట్లు వచ్చి పర్యాటకులను వేటాడారని.. ఐడీ కార్డులు అడిగి హిందువా, ముస్లింవా అని అడిగి మరీ అత్యంత క్రూరంగా అమాయకుల ప్రాణాలు తీశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్ముకశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన వారికి నివాళులర్పించే కార్యక్రమం మంగళవారం నాడు మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో నిర్వహించారు..ఈ సంతాప సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , మంత్రి నాదెండ్ల మనోహర్ ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మృతులకు సంతాపం తెలియజేస్తూ రెండు నిమిషాల పాటు నేతలు మౌనం పాటించారు. ఉగ్రదాడి మృతులకు డిప్యూటీ సీఎం నివాళులు అర్పించారు.
దేశమంతా ఏకమవ్వాల్సిన సమయం వచ్చింది.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. అమాయకులను అత్యంత దారుణంగా చంపారన్నారు. సరిహద్దు భద్రత అత్యంత అవసరమన్నారు. నిరాయుధులతో యుద్ధం చేయకూడదని తెలిపారు. ఎంతో నమ్మకంతోనే కశ్మీర్ పర్యటనకు వెళ్లారన్నారు. కశ్మీర్లో రాష్ట్రపతి పాలన ఉన్నంత వరకు ప్రశాంతంగా ఉందని.. అధికారం రాష్ట్రం చేతిలోకి వెళ్లగానే ఇలాంటి ఘటన జరిగిందన్నారు. ఉగ్రవాదులపై కనికరం అవసరం లేదన్నారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించాలని కోరారు. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలన్నారు. దేశమంతా ఏకమవ్వాల్సిన సమయం ఆసన్నమైందని వెల్లడించారు.
లక్షలాదిమంది కశ్మీరీ పండిట్లు వలస వెళ్లిపోయారని తెలిపారు. అప్పటి నుంచి కశ్మీర్ మండుతూనే ఉందన్నారు. కశ్మీర్ భారత్లో భాగమే.. ఎప్పటికీ అంతే అని స్పష్టం చేశారు. భారత్లో ఉండి పాకిస్థాన్కు మద్దతుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పాకిస్థాన్పై ప్రేమ ఉన్నవారు ఆ దేశం వెళ్లిపోవచ్చని అన్నారు. మతం అడిగి చంపేశారని ప్రత్యక్ష సాక్షులు చెబుతుంటే నమ్మరెందుకని ప్రశ్నించారు.
హిందువులకు ఉన్నది ఒక్కదేశమే .. అది భారత్
అతి మంచితనం కూడా మంచిది కాదని అభిప్రాయపడ్డారు. కాల్చుకుంటూ పోతే చూస్తూ ఊరుకోవాలా.. అతి సహనం కూడా ప్రమాదకరమన్నారు. పాకిస్థాన్ను మూడు సార్లు ఓడించామని గుర్తుచేశారు. జనసేన ఉన్నది తెలుగు రాష్ట్రాల్లోనే.. కానీ మాది జాతీయ విధానమని తేల్చి చెప్పారు. ఉగ్రవాదులను ఎదుర్కోవాలంటే ధైర్యంతో కూడుకున్న పని అని అన్నారు. హిందువులకు ఉన్నది ఒక్కటే దేశమని ఇక్కడ కూడా హిందువులనే టార్గెట్ చేస్తే ఎక్కడికి పోవాలని అన్నారు. హత్య చేసి మోదీకి చెప్పుకోండి అన్నారని పర్యాటకులు చెబుతున్నారని తెలిపారు.
మధుసూధన్ కు రూ రూ.50లక్షల పరిహారం
ఉగ్రదాడిలో చనిపోయిన కావలికి చెందిన మధుసూదన్ కుటుంబానికి పరిహారం ప్రకటించారు పవన్. జనసేన పక్షాన మదుసూదన్ కుటుంబానికి యాభై లక్షలను ప్రకటించారు. అతని కుటుంబానికి జనసేన పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ామనం ఏదొక రూపంలో ప్రాణాలు కోల్పోతాం. అది దేశంకోసం అయితే మన మరణానికి ఒక అర్ధం ఉంటుంది. మదుసూదన్ కుటుంబం ఆ పరిస్థితి నుంచి బయటకు రావడం చాలా కష్టం. ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వారందరికి జనసేన పక్షాన నివాళి అర్పిస్తున్నాం్ణ అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.